లక్ష్మణచాంద: చెరువులో మునిగి వ్యక్తి మృతి చెందిన సంఘటన మండల కేంద్రంలో చోటు చేసుకుంది. మండలానికి చెందిన కుంచపొల్ల నర్సింలు (68) గత కొన్నేళ్లుగా పశువుల కాపరిగా జీవనం సా గిస్తున్నాడు. ఆదివారం మండల కేంద్రం సమీపంలోని ఊర చెరువు వద్ద పశువులు మేపడానికి వెళ్లాడు. మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో గేదెలు మేపుతుండగా కొన్ని గేదెలు నీటిలోనికి వెళ్లడంతో నర్సింలు వాటిని ఒడ్డుకు చేర్చడానికి నీటిలో దిగగా ప్రమాదవశాత్తు మునిగిపోయాడు. సాయంత్రం ఇంటికి రాకపోవడంతో కుమారుడు సాయిలు చుట్టుపక్కల వెతికినా ఆచూకీ లభించలేదు. సోమవారం ఉదయం చెరువు సమీపంలో కుటుంబ సభ్యులు వెతికే క్రమంలో మృతదేహం కనిపించింది. దీంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్సై శ్రావణి సంఘటన స్థలానికి చేరుకుని పంచనామా నిర్వహించారు. సాయిలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు. మృతుడికి భార్య, కుమారుడు ఉన్నారు.


