జన్నారం: విద్యావిధానంపై అధ్యయనానికి ఫిన్లాండ్ వెళ్లిన జన్నారం మండలానికి చెందిన దాముక కమలాకర్, జాజల శ్రీనివాస్ అనే ఉపాధ్యాయులకు ఫిన్లాండ్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న దాసర రాజేశ్ సోమవారం ఘనంగా స్వాగతం పలికారు. ఈనెల 20 నుంచి 24 వరకు ఫిన్లాండ్లో విద్యావిధానంపై అధ్యయనం చేయనున్నట్లు ఉపాధ్యాయులు ఫోన్ ద్వారా తెలిపారు.
ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య
గుడిహత్నూర్: ఆర్థిక ఇబ్బందులతో ఆదిలా బాద్లోని రిక్షా కాలనీకి చెందిన మేకల దయాకర్ (44) ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మేకల దయాకర్ చిరు వ్యాపారాలు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. వ్యాపారంలో ఆశించిన ఆదాయం రాకపోవడంతో కొన్ని నెలలుగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. ఈక్రమంలో తీవ్ర మనస్తాపానికి గురై సోమవారం ఇంటి నుంచి బయటకు వచ్చి మేకలగండి అటవీ ప్రాంతంలో చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఉరేసుకునే ముందు తన సెల్ఫోన్ ద్వారా కుటుంబ సభ్యులకు మేకల గండి వద్ద ఆత్మహత్య చేసుకుంటున్నట్లు వాట్సాప్ మెసేజ్ పంపాడు. దీంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన అక్కడికి చేరుకొని వెతుకగా ఓ చెట్టుకు వేలాడుతూ కన్పించాడు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఎస్సై శ్రీకాంత్ సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్కు తరలించారు. కుమారుడు మేకల మహేశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.


