మంచిర్యాలఅగ్రికల్చర్: ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్లు పి.చంద్రయ్య, రాములుతో కలిసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. నెన్నెల మండలం నార్వాయిపేటకు చెందిన కై రత్ పాషా వారసత్వంగా వస్తున్న భూమిని కొందరు అక్రమంగా పట్టా చేసుకున్నారని, దీనిపై సమగ్ర విచారణ జరపాలని కోరుతూ అర్జీ సమర్పించారు. మంచిర్యాలకు చెందిన సాయిని శ్రీనివాస్ పట్టా పాస్ పుస్తకం మంజూరు చేయాలని, తాండూర్ మండలం బోయపల్లికి చెందిన ఎలిగేటి సాయికుమార్ తమ తాతల నుండి వారసత్వంగా వస్తున్న భూమిని కొందరు తమకు తెలియకుండా విక్రయించారని, తమకు న్యాయం చేయాలని కోరారు. కన్నెపల్లి మండలం సాలిగాంకు చెందిన తాళ్లపల్లి నరేష్ తాను రిజిస్టర్ డాక్యుమెంట్ ద్వారా కొనుగోలు చేసిన భూమిని తన పేరిట ఆన్లైన్లో నమోదు చేయాలని, దండేపల్లికి చెందిన గుండా రవీందర్ తల్లితండ్రుల పోషణ చట్టం ప్రకారం తన కుమారుని నుండి ప్రతీనెల నగదు ఇప్పించాలని, మంచిర్యాలకు చెందిన కొత్త మాధవి, కొత్త కిరణ్ దివ్యాంగుల పెన్షన్ ఇప్పించాలని, తిలక్నగర్కు చెందిన లింగన్నపేట సత్యనారాయణ వృద్ధాప్య పింఛన్ ఇప్పించాలని, లక్సెట్టిపేట మండలం పోతపల్లికి చెందిన ఆవునూరి రాయలింగు తనకున్న భూమి ప్రభుత్వ రికార్డులోకి ఎక్కించి పట్టా ఇప్పించాలని దరఖాస్తు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణిలో అందిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించే దిశగా అధికారుల సమన్వయంతో చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.


