ఆదిలాబాద్రూరల్: ఆశ్రమ పాఠశాలల్లో చదువుతున్న గిరిజన విద్యార్థులకు మెరుగైన విద్య అందించాలని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్ సంతోష్ ఐటీడీఏ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా కేంద్రానికి వచ్చిన ఆయన భుక్తాపూర్ కాలనీలో గల గిరిజన బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలను సందర్శించారు. విద్యార్థులను పలు ప్రశ్నలు ఆడిగి సమాధానం రాబట్టారు. కంప్యూటర్ ల్యాబ్, వంట గదిని పరిశీలించి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. స్టోర్ రూమ్ను తనిఖీ చేసి సరుకులను పరిశీలించారు. మెనూ అమలు తీరును అడగగా ఐటీడీఏ యాప్ ఏర్పాటు చేసి పకడ్బందీగా మెనూ అమలు చేస్తున్నామని సిబ్బంది వివరించారు. అనంతరం డార్మెట్రీ నిర్మాణ పనులను పరిశీలించి అసంపూర్తిగా ఉన్న పనులను వెంటనే పూర్తి చేయాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. జుగా కింద మరో రూ.2 కోట్లు మంజురయ్యాయని, పనులు వెంటనే ప్రారంభించేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ డీడీ జాదవ్ అంబాజీ, సీఈ బాలు నాయక్, ఎస్ఈ ఫణికుమారి, ఈఈ తానాజీ, ఏటీడీవో నిహారిక, జిల్లా గిరిజన క్రీడల అధికారి పార్థసారథి, ప్రధానోపాధ్యాయురాలు స్వర్ణలత, తదితరులు పాల్గొన్నారు.


