మంచిర్యాలరూరల్(హాజీపూర్): హాజీపూర్ మండల పరిషత్ కార్యాలయంలో నైట్ వాచ్మెన్గా విధులు నిర్వర్తిస్తున్న కొత్తకొండ తిరుపతి(53) ఆదివారం ఉదయం విధులు నిర్వహిస్తూనే ఆకస్మికంగా మృతి చెందాడు. స్థానికులు, హాజీపూర్ ఎస్సై కిరణ్కుమార్ కథనం మేరకు.. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని తాళ్లపల్లికి చెందిన కొత్తకొండ తిరుపతి హా జీపూర్ ఎంపీపీ కార్యాలయంలో గత రెండేళ్లుగా నైట్ వాచ్మెన్గా పని చేస్తున్నాడు. ఆది వారం విధి నిర్వహణలో ఉన్న తిరుపతి కార్యాలయ ఆవరణలో కుప్పకూలి పడిపోయాడు. వెంటనే స్థానికులు గమనించి మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతుడికి భార్య సత్తమ్మ, కుమారుడు సాయికుమార్, కుమార్తె శైలజ ఉన్నారు. మృతుడి కుమారుడు సాయికుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని మృతికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.


