జైపూర్: సింగరేణి సంస్థలో కార్మికులు ఆర్థిక దోపిడీకి గురవుతున్నారని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి ఆరోపించారు. మండలంలోని ఇందారం ఐకే 1ఏ, ఐకే–ఓసీపీపై శుక్రవారం నిర్వహించిన గేట్మీటింగ్కు యూనియన్ జనరల్ సెక్రటరీ కేతిరెడ్డి సురేందర్రెడ్డి, శ్రీరాంపూర్ ఏరియా ఉపాధ్యక్షుడు బండి రమేశ్తో కలిసి హాజరై మాట్లాడారు. 2024–25 ఆర్థిక సంవత్సరంలో ఎనిమిది మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తిని అధికంగా చూపించి లాభాలు పెంచినట్లు ప్రభుత్వాన్ని ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేశారని ఆరోపించారు. లాభాలను పంచే సమయంలో సగానికి తగ్గించి ఇవ్వడం అన్యాయమని విమర్శించారు. మెడికల్ బోర్డు అంశంపై ఉపముఖ్యమంత్రి భట్టి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు తెలిపారు. మెడికల్ అన్ఫిట్ ఉద్యోగులపై ఏసీబీ విచారణ చేపట్టడం సరికాదని పేర్కొన్నారు. సింగరేణిలో అక్రమాలు, ఓబీ కాంట్రాక్టులు, డీజిల్ వినియోగం, జైపూర్ పవర్ ప్లాంట్లో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కాంగ్రెస్, గుర్తింపు కార్మిక సంఘాలు నెరవేర్చలేదని ఆరోపించారు. అనంతరం ఏఐటీయూసీ అసిస్టెంట్ పిట్ సెక్రటరీ ధరణి దేవేందర్, సేఫ్టీ కమిటీ అసిస్టెంట్ పిట్ సభ్యులు మనోహర్, వెంకటేశ్, రాజేందర్, రమేశ్తో పాటు 30మంది టీబీజీకేఎస్లో చేరగా వారికి కండువా కప్పి ఆహ్వానించారు. డిప్యూటీ జనరల్ సెక్రటరీ జావిద్ పాషా, సెంట్రల్ ఆర్గనైజ్ సెక్రటరీ అన్వేశ్రెడ్డి, డివిజన్ సెక్రటరీ గడ్డం మైపాల్రెడ్డి, గొర్ల సంతోష్, పిట్ సెక్రటరీ గడ్డం మల్లయ్య, గోగర్ల పాల్ రామారావు, ఆకుల సతీశ్, రమణకుమార్, వేణుగోపాల్, నర్సింహస్వామి, శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.


