నెన్నెల: మండలంలోని బొప్పారం గ్రామానికి చెందిన కర్ణకొండ చందు అనే రైతుకు చెందిన రెండు ఎడ్లు, నార వెంకన్నకు చెందిన ఒక ఎద్దును గురువారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేశారు. బాధిత రైతులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధితులు రోజులాగే ఎడ్లను కట్టేసి ఇంట్లో నిద్రపోయారు. తెల్లవారేసరికి వారి ఎడ్లు కనిపించలేదు. చుట్టు పక్కల వెతికినా ఆచూకీ లభించలేదు. బొప్పారం బస్షెల్టర్ వద్ద బొలెరో వాహనంలో ఎక్కించుకున్నట్లు ఆధారం దొరకగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దొంగలు ఎత్తుకెళ్లిన ఎద్దుల విలువ రూ.1.70 లక్షలు ఉంటుందని బాధితులు తెలిపారు. పోలీసులు గ్రామాన్ని సందర్శించి వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పలు కూడళ్లలోని సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించగా, తెల్లవారుజామున 3గంటల ప్రాంతంలో నందులపల్లి, గన్పూర్, ఆవుడం, ఆదిల్పేట్ మీదుగా బొలెరో వాహనం శ్రీరాంపూర్ వైపు వెళ్లినట్లు గుర్తించారు. దుండగులను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.


