ఇంగ్లిష్ సబ్జెక్టు టీచర్ల కొరత
ఉపాధ్యాయులకు ఫోన్ చేసిన డీఈవో
మధ్యాహ్నం తర్వాత ప్రక్రియ మొదలు
మంచిర్యాలఅర్బన్: జిల్లాలో పదో తరగతి పరీక్ష జవాబు పత్రాల మూల్యాంకనం బుధవారం ప్రారంభమైంది. స్థానిక ఏసీసీ కార్మెల్ హైస్కూల్ స్పాట్ కేంద్రంలో తొలిరోజు ఉదయం పూటంతా ఉపాధ్యాయులు రిపోర్టు చేయడం, విధులపై శిక్షణతోనే సరిపోయింది. కేంద్రానికి వచ్చిన పలువురు టీచర్లు విధుల రద్దుకు అన్ని ప్రయత్నాలు చేశారు. చెట్ల కింద, తరగతి గదుల వరండాలో అటూ ఇటూ కలియదిరిగారు. అనారోగ్యం, అత్యవసర కారణాల సాకుతో విధులకు దూరంగా ఉండేందుకు పైరవీలు సాగించారు. దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వారికి విధుల నుంచి మినహాయింపు ఇచ్చారు. ఉపాధ్యాయుల వద్దకు వెళ్లి మూల్యాంకనం విధులకు హాజరు కావాలని డీఈవో యాదయ్య సూచించడం కనిపించింది. ఇంగ్లిషు టీచర్ల కొరత, విధులకు హాజరు కాని వారికి డీఈఓ ఫోన్లు చేయాల్సి వచ్చింది.
మధ్యాహ్నం తర్వాత
ఇతర జిల్లాల నుంచి ఆయా పరీక్షలకు సంబంధించిన 1,31,398 జవాబు పత్రాలు మంచిర్యాల మూల్యాంకన కేంద్రానికి చేరాయి. మూల్యాంకానికి డీఈవో యాదయ్య శిబిరం అధికారిగా, పరీక్షల విభాగం సహాయ కమిషనర్గా మల్లేశం(స్ట్రాంగ్రూం), సహాయ క్యాంపు అధికారులుగా పోచయ్య(అడ్మినిస్ట్రేషన్), తిరుపతిరెడ్డి(స్పాట్ వాల్యూయేషన్) వ్యవహరిస్తున్నారు. మొదటి రోజు తెలుగు, హిందీ, ఇంగ్లిషు, గణితం సబ్జెక్టుల మూల్యాంకానికి చీఫ్ ఎగ్జామినర్లు(సీఈ), ఏఈలు, స్పెషల్ అసిస్టెంట్లుగా పలువురికి రెండ్రోజుల ముందే విధులు కేటాయించారు. విషయం తెలుసుకున్న ఉపాధ్యాయులు కొందరు కారణాలు వెతికి తప్పించుకోవాలని చూడడంతో తొలి రోజు మూల్యాంకనం ఆలస్యమైంది. డీఈవో యాదయ్య ఫోన్లు చేసి విధులకు హాజరు కావాలని ఆదేశించాల్సి వచ్చింది. మధ్యాహ్నం తర్వాత జవాబు పత్రాల మూల్యాంకనం కొనసాగింది.
విధులు కేటాయించిన
ఉపాధ్యాయుల సంఖ్య
సబ్జెక్టు సీఈలు ఏఈలు స్పెషల్
అసిస్టెంట్లు
తెలుగు 5 30 10
హిందీ 4 4 8
ఇంగ్లిషు 12 72 24
గణితం 7 40 13


