జన్నారం: ప్రజాపాలనలో పేదల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలో అర్హులైన 72మందికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్, సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. రైతువేదికలో వ్యవసాయ యాంత్రీకరణ్ పథకంలో భాగంగా ఐదు పవర్ టిల్లర్లను రైతులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొజ్జు పటేల్ మాట్లాడుతూ వేసవిలో నీటి సమస్య రాకుండా చర్యలు తీసుకుంటున్నామని, ఆడబిడ్డలకు కష్టం లేకుండా చేసే బాధ్యత తనదని అన్నారు. అర్హులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశామని, నిర్మాణం త్వరగా పూర్తి చేసుకోవాలని సూచించారు. ప్రతీ గ్రామం అభివృద్ధి జరిగేలా సీసీ రోడ్లు, డ్రైనేజీల కోసం నిధులు మంజూరు చేసినట్లు చెప్పారు. కల్యాణలక్ష్మి, సీఎంఆర్ఎఫ్ కోసం ఎవరైనా డబ్బులు అడిగితే ఇవ్వవద్దని, తన దృష్టికి తీసుకువస్తే చర్యలు తీసుకుంటానని అన్నారు. వేసవిలో నీటి సమస్య రాకుండా అవసరమైన చోట బోరు వేయిస్తామని, ట్యాంకులు, నల్లాల మరమ్మతులు చేయిస్తానని తెలిపారు. ఏ సమస్య వచ్చినా నేరుగా తన దృష్టికి తీసుకురావాలని, ఏ సమయంలోనైనా తనను కలువవచ్చని, ఫోన్ ద్వారా సమస్య చెప్పినా స్పందిస్తానని తెలిపారు. అనంతరం రాంపూర్, పొనకల్ శ్రీలంక కాలనీ, రేండ్లగూడ గ్రామాల్లో పలు కుటుంబాలను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రామ్మోహన్, ఎంపీడీవో ఉమర్షరీఫ్, మార్కెట్ కమిటీ చైర్మన్ దుర్గం లక్ష్మీనారాయణ, వైస్ చైర్మన్ ఫసీఉల్లా, మాజీ జెడ్పీటీసీ ఎర్ర చంద్రశేఖర్, పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు మోహన్రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఇసాక్, కార్యదర్శి ముజాఫర్ అలీఖాన్, సర్పంచులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.


