మంచిర్యాలఅగ్రికల్చర్: ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా గ్రామసభలు/వార్డు సభలు పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. మంగళవారం హైదరాబాద్ నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, వివిధ శాఖల కార్యదర్శులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్, వివిధ శాఖల జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. భట్టి విక్రమార్క మాట్లాడుతూ ఏప్రిల్ 2న నిర్వహించే గ్రామ, వార్డు సభలకు స్థానిక ప్రజాప్రతినిధులను ఆహ్వానించాలని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాలు రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇళ్లు, సన్నబియ్యం పంపిణీ తదితర వా టిపై వివరించాలని అన్నారు. కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ జిల్లాలో గ్రామ, వార్డు సభల నిర్వహణకు ఏర్పాట్లు చేశామని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ పి.చంద్రయ్య, జిల్లా అధికారులు, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు.
మహిళల సంక్షేమానికి పెద్దపీట
మంచిర్యాలఅగ్రికల్చర్: మహిళల సంక్షేమం, ఆర్థిక అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్లో జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి కిషన్, మంచిర్యాల నగర మేయర్ ధర్ని మధుకర్, డిప్యూటీ మేయర్ సల్ల రమ్య, జిల్లా మహిళా సమాఖ్య ప్రతినిధి అనితతో కలిసి ఏపీఎంలు, డీపీఎంలు, స్వయం సహాయక సంఘాల మహిళలతో మహాలక్ష్మి పథకం అమలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల నిర్వహణపై సమీక్ష నిర్వహించారు.
ముదిగుంటను ఆదర్శంగా తీసుకోవాలి
జైపూర్: ముదిగుంట గ్రామాన్ని ఆదర్శంగా తీసుకోవాలని, జల సంరక్షణ చర్యలు చేపడుతూ భూగర్భజలాలను సంరక్షించుకోవాలని కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. ఇటీవల ప్రధానమంత్రి 132వ మన్ కీ బాత్ కార్యక్రమంలో ముదిగుంట గ్రామంలో చేట్టిన జల సంరక్షణ చర్యలను ప్రత్యేక అభినందిస్తూ ప్రశంసించారు. మంగళవారం కలెక్టర్ కుమార్ దీపక్, జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారి కిషన్ను ముదిగుంట సర్పంచ్ ఆకుల రవికుమార్, పాలకవర్గం, ఎంపీడీవో సత్యనారాయణ, ఎంపీవో శ్రీపతిబాపురావు, ఏపీవో బాలయ్య శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ముదిగుంట పంచాయతీ కార్యదర్శి సురేశ్, ఈజీఎస్ ఈసీ రాజమొగిలి, సిబ్బంది శిరీష, శృతి, సంతోశ్, సువర్ణ, ఉపసర్పంచ్ పత్తి సంధ్యారాణి, వార్డు సభ్యులు రాజశేఖర్, మనోహర్, విజయ్ పాల్గొన్నారు.


