పాతమంచిర్యాల: మధ్యాహ్న భోజన కార్మికుల వేతనం రూ.10 వేలకు పెంచాలని, మెస్చార్జీలు పెంచాలని, గ్యాస్ కొరత లేకుండా చూడాలని మధ్యాహ్న భోజన కార్మిక సంఘం జిల్లా అధ్యక్షురాలు దాసరి రాజేశ్వరి, కార్యదర్శి రఫీయా డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని సీఐటీయూ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యల పరిష్కారంలో విఫలమైందని అన్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో మధ్యాహ్న భోజనం, జీతాల పెంపునకు నిధులు పెంచకపోవడం దారుణమని తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు టిఫిన్, పాలు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని, ఎన్ని నిధులు ఖర్చు చేస్తారనేది లేదని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మధ్యాహ్న భోజన కార్మికులు సరిత, ఉమారాణి, మధునమ్మ పాల్గొన్నారు.


