ట్రాన్స్ఫార్మర్ ధ్వంసం చేసిన దుండగులు
తాండూర్: మండలంలోని నీలాయపల్లి పంచాయతీ పరిధిలో ట్రాన్స్ఫార్మర్ను గుర్తుతెలియని దుండగులు ధ్వంసం చేసి అందులో రాగి తీగను ఎత్తుకెళ్లారు. వివరాలు ఇలా ఉన్నాయి.. మాదారం పోచమ్మ ఆలయానికి ఎదురుగా ఉన్న ట్రాన్స్ఫార్మర్ నుంచి విద్యుత్ సరఫరా నీలాయపల్లి పంచాయతీకి నీటి సరఫరా చేసే బోరుకు అనుసంధానం చేసి ఉంది. రోజువారీ విధుల్లో భాగంగా మల్టీపర్పస్ వర్కర్.. నీటి బోరు వేయగా పని చేయలేదు. సమీపంలో ఉన్న ట్రాన్స్ఫార్మర్ వద్ద వెళ్లి చూసేసరికి అది ధ్వంసమై ఉంది. శుక్రవారం రాత్రి దుండగులు ట్రాన్స్ఫార్మర్ను ధ్వంసం చేసి రాగి తీగను చోరీ చేశారని గుర్తించి సర్పంచులకు సమాచారమిచ్చారు. నీలాయపల్లి, మాదారం సర్పంచులు పోలవేణి తిరుపతి, కుశ్నపల్లి లక్ష్మీనారాయణ ఘటనస్థలానికి చేరుకుని పరిశీలించారు. విద్యుత్ అధికారులు, పోలీసులకు ఫిర్యాదు చేశారు. విద్యుత్ శాఖ ఏఈ జాన్, పంచాయతీ కార్యదర్శి రంజిత్, ఉప సర్పంచులు సూరం దామోదర్రెడ్డి, రాపల్లి సతీశ్లు అక్కడికి చేరుకుని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ట్రాన్స్ఫార్మర్ ధ్వంసంతో పంచాయతీ పరిధిలో నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడింది.


