ఓట్ల లెక్కింపు ప్రశాంతం
మంచిర్యాలరూరల్(హాజీపూర్): మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఓట్ల లెక్కింపు శుక్రవారం ముల్కల్లలోని ఐజా ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించారు. 60 డివిజన్లకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ మూడంచెల భద్రత మధ్య సాగింది. లెక్కింపు నెమ్మదిగా సాగడంతో సాయంత్రం వరకు ఫలితాలు వెల్లడయ్యాయి. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్దీపక్ పర్యవేక్షణలో మున్సిపల్ కమిషనర్ గోనె అన్వేష్ ఆధ్వర్యంలో ఓట్ల లెక్కింపు నిర్వహించారు. 265 పోలింగ్ కేంద్రాల్లోని బ్యాలెట్ బాక్సులను ఒక్కో టేబుల్పై 1,000 ఓట్లకు ఒక్కో రౌండ్ చొప్పున 2, 3 రౌండ్ల వారీగా లెక్కింపు సాగింది. ఒక్కో టేబుల్కు ఒక కౌటింగ్ అధికారి, ఇద్దరు అదనపు కౌంటిగ్ అధికారులతోపాటు మొత్తం 300 మంది సిబ్బందితో పకడ్బందీగా నిర్వహించారు. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు చేపట్టగా కాంగ్రెస్ ముందంజలో నిలిచింది. కాంగ్రెస్ పార్టీకి 399, బీజేపీకి 166, బీఆర్ఎస్కు 14, బీఎస్పీకి 2, సీపీఐకి 3, ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీకి 9, జనసేన పార్టీకి 3, ఎంఐఎం 3, నోటాకు 5 వచ్చాయి. 5 ఓట్లు చెల్లకుండా పోయాయి.
స్వల్ప మెజారిటీతో..
మంచిర్యాల కార్పొరేషన్ ఎన్నికల్లో పలువురు స్వల్ప ఓట్ల తేడాతో గెలుపొందారు. 9వ డివిజన్లో సురిమిళ్ల సౌమ్య(కాంగ్రెస్) సమీప ప్రత్యర్థి జాడి రమ్యకుమారి(బీఆర్ఎస్)పై 6 ఓట్ల తేడాతో గెలు పొందింది. 57 డివిజన్లో గాజుల ముఖేశ్గౌడ్(బీజేపీ) సమీప అభ్యర్థి బుద్దార్థి రాంచందర్(కాంగ్రెస్)పై 12 ఓట్ల తేడాతో విజ యం సాధించాడు. 34వ డివిజన్ అభ్యర్థి అగ్గు సాగర్(జనసేన) సమీప అభ్యర్థి అగల్డ్యూటీ రాజు(కాంగ్రెస్)పై 21 ఓట్లతో గెలుపొందాడు. 4వ డివిజన్లో గుమ్మడి శ్రీనివాస్(బీఆర్ఎస్) సమీప అభ్యర్థి అంగిడి రాజేశ్(కాంగ్రెస్)పై 38 ఓట్లతో గెలుపొందాడు. 56 డివిజన్లో నల్ల శంకర్(కాంగ్రెస్) తన సమీప అభ్యర్థి వెంగల కొమురయ్య(బీజేపీ)పై 62 ఓట్లతో, 55వ డివిజన్లో పెట్టం స్వరూప(బీఆర్ఎస్) కాంగ్రెస్ అభ్యర్థి గట్టు స్రవంతి(కాంగ్రెస్)పై 65 ఓట్లతో గెలుపొందారు.
చెన్నూర్లో పరిశీలిస్తున్న కలెక్టర్ కుమార్ దీపక్
మంచిర్యాలలో ఓట్ల లెక్కింపు
సందర్శించిన కలెక్టర్
చెన్నూర్: చెన్నూర్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ సందర్శించారు. కౌంటింగ్ తీరుపై ఎన్నికల పరిశీలకులు కిషన్ను అడిగి తెలుసుకున్నారు. భద్రత, ఓట్ల లెక్కింపు ఏర్పాట్లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో రామగుండం డీసీపీ(అడ్మిన్) కే.శ్రీనివాస్రావు, జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు, ఎన్నికల అధికారి మురళికృష్ణ పాల్గొన్నారు.
భారీ మెజారిటీతో...
14వ డివిజన్లో తూముల నరేశ్(కాంగ్రెస్) తన సమీప అభ్యర్థి ఒడ్నాల రవీందర్(బీఆర్ఎస్)పై 1,468 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందాడు. 42వ డివిజన్లో చిందం సత్యవతి(కాంగ్రెస్) సమీప అభ్యర్థి అంకం సంజీత(బీజేపీ)పై 637 ఓట్ల మెజారిటీతో విజయం సాధించింది.
భారీ బందోబస్తు
మంచిర్యాలక్రైం: కౌంటింగ్ కేంద్రాల వద్ద మంచిర్యాల డీసీపీ ఎగ్గడి భాస్కర్ పటిష్టమైన మూడంచెల బందోబస్తు ఏర్పాటు చేశారు. కౌంటింగ్ కేంద్రం సమీపంలో ఏర్పాటు చేసిన మీడియా పాయింట్ వరకే సెల్ఫోన్లు, వీడియోలను అనుమతించారు. కేంద్రంలోకి మీడియా ప్రతినిధులను సైతం అనుమతించలేదు. 300 మీటర్ల దూరంలో ప్రత్యేక తనిఖీ పాయింట్లను ఏర్పాటు చేశారు. ఎన్నికల సంఘం జారీ చేసిన గుర్తింపు కార్డులు కలిగి ఉన్న వారినే కౌంటింగ్ కేంద్రం వద్దకు అనుమతించారు. ఫలితాల కోసం వివిధ పార్టీల అభిమానులు కౌంటింగ్ కేంద్రానికి మూడు వందల మీటర్ల దూరంలో పడిగాపులు కాశారు. డీసీపీ భాస్కర్ కౌంటింగ్ కేంద్రాన్ని సందర్శించి పోలీసులను అప్రమత్తం చేశారు. ఏసీపీ ప్రకాష్, సీఐ ప్రమోద్రావు, ఆకుల అశోక్, నరేష్కుమార్, సత్యనారాయణ, ఎస్సైలు పాల్గొన్నారు.
ఓట్ల లెక్కింపు ప్రశాంతం
ఓట్ల లెక్కింపు ప్రశాంతం


