ఎస్బీఐలో రైతు డబ్బులు చోరీ
బాసర: బాసరలోని ఎస్ బీఐలో ఓ రైతు విత్డ్రా చేసుకున్న రూ.50వేలను గుర్తు తెలియని మహిళ అపహరించింది. ఎస్సై నవనీత్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని దొడపూర్ గ్రామానికి చెందిన దత్తారం సాంబాజీ అనే రైతు డబ్బులు డ్రా చేసుకునేందుకు ఎస్బీఐకి వచ్చాడు. మొదట రూ.50వేలు విత్ డ్రా చేసుకున్నాడు. మరోసారి డబ్బులు విత్డ్రా చేసుకునేందుకు క్యూలైన్లో నిల్చోగా అతడి వద్ద ఉన్న రూ.50వేలను బురఖాలో ఉన్న గుర్తు తెలియని మహిళ అపహరించినట్లు బాధితుడు తెలిపాడు. వెంటనే బ్యాంక్ మేనేజర్ అశోక్కుమార్తో కలిసి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు బ్యాంక్కు చేరుకుని సీసీ ఫుటేజీని పరిశీలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
ఈ సారు మాకొద్దు..
భీమిని: కన్నెపల్లి మండలంలోని పోలంపల్లి ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు కె.రాజు బుధవారం అదే గ్రామంలోని ఓ బెల్ట్షాపులో మద్యం సేవిస్తుండగా గ్రామస్తులు నిలదీశారు. విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించే ఉపాధ్యాయుడే పట్టపగలు తప్పతాగి పాఠశాలకు వస్తే ఎలా అని మండిపడ్డారు. గతంలో సైతం పలుమార్లు మద్యం మత్తులో పాఠశాలకు వచ్చాడని వారు పేర్కొన్నారు. మధ్యాహ్నమే ఉపాధ్యాయుడు పాఠశాలకు తాళం వేసి వెళ్లిపోవడంతో తల్లిదండ్రులు, గ్రామస్తులంతా కలిసి ఈసారు మాకొద్దు అంటూ ఎంఈవోకు ఫిర్యాదు చేశారు. ఈ విషయమై ఎంఈఓ రామును వివరణ కోరగా విచారణ జరిపి ఉన్నతాధికారులకు నివేదిక అందజేస్తామని, తదుపరి ఆదేశాల మేరకు ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకుంటామన్నారు.
ఎస్బీఐలో రైతు డబ్బులు చోరీ
ఎస్బీఐలో రైతు డబ్బులు చోరీ


