
జోర్డాన్లో అంబకంటి యువకుడు మృతి
కుంటాల: మండలంలోని అంబకంటికి చెందిన బొల్లపల్లి రవికుమార్ (34) పదేళ్లక్రితం ఉపాధి కోసం జోర్డాన్ వెళ్ళి అక్కడి ఎర్బిడ్ పట్టణంలో క్లాసికల్ ఫ్యాషన్ అప్పరిల్ ఇండస్ట్రీ లిమిటెడ్ కంపెనీలో ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తున్నాడు. రెండేళ్ల క్రితమే ఇదే గ్రామానికి చెందిన లక్ష్మితో వివాహంకాగా ఐదు నెలల క్రితమే ఇక్కడి నుంచి వెళ్లిపోయాడు. లుకోమియా వ్యాధితో బాధపడుతుండగా అదే కంపెనీలో పనిచేస్తున్న ఉత్తరప్రదేశ్కు చెందిన రాంగోపాల్ను తోడుగా ఇచ్చి ఇండియాకు పంపించేందుకు ఏర్పాట్లు చేశారు. గత ఆగస్టు 30న స్వగ్రామానికి వస్తుండగా షార్జాలో ఫ్లైట్ మార్చే క్రమంలో తీవ్ర అనారోగ్యానికి గురికావడంతో షార్జాలోని అల్ క్వాసిమి ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. శుక్రవారం మృతదేహం స్వగ్రామానికి రానున్నట్లు స్థానికులు తెలిపారు.
విద్యుత్ షాక్తో రైతు మృతి
దహెగాం: విద్యుత్షాక్తో రైతు మృతి చెందిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. హెడ్కానిస్టేబుల్ ఉత్తం తెలిపిన వివరాల మేరకు పీకలగుండం (చర్చిగూడ)కు చెందిన రైతు గోమాస పోశం (60) గురువారం మధ్యాహ్నం భార్య లాంచుబాయితో కలిసి పొలానికి వెళ్లాడు. మోటర్ ఆన్చేస్తుండగా షాక్ తగలడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి భార్య, నలుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కుమారుడు గోమాస అశోక్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు హెడ్కానిస్టేబుల్ తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో ఒకరు..
కుభీర్: రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై కృష్ణారెడ్డి తెలిపిన వివరాల మేరకు పార్డి(కె) గ్రామానికి చెందిన మహార్ శ్రీనివాస్ (30) బుధవారం రాత్రి పుస్పూర్లో ఉన్న అత్తగారింటికి బైక్పై వెళ్లివస్తుండగా హెచ్పీ పెట్రోల్ బంక్ సమీపంలో రోడ్డుపక్కన చెట్టుకు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. గురువారం మధ్యాహ్నం పల్సి గ్రామానికి చెందిన వ్యక్తి గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పార్డి(కె) వాసి శ్రీనివాస్గా గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతుని భార్య ప్రేమల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
గంజాయి కేసులో 14 రోజుల రిమాండ్
చోరీ కేసులో నిందితుడి అరెస్టు
సోన్: మండల కేంద్రంలోని బ్రాహ్మణమఠంలో ఇటీవల చోరీకి పాల్పడిన నిందితుడిని అరెస్టు చేసినట్లు ఏఎస్పీ రాజేశ్ మీనా తెలిపారు. గురువారం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. కూలీపని చేసుకుంటూ జీవనం సాగిస్తున్న మండల కేంద్రానికి చెందిన శివరాత్రి సేనాపతి జల్సాలకు అలవాటుపడ్డాడు. ఇటీవల బ్రాహ్మణమఠం తాళం పగులగొట్టి అందులో ఉన్న అతి పురాతనమైన వంటసామగ్రిని ఎత్తుకెళ్లాడు. వాటిని విక్రయించగా వచ్చిన సొమ్ముతో జల్సాలు చేసుకునేవాడు. అనుమానం వచ్చిన పోలీసులు అతన్ని విచారించగా నేరం ఒప్పుకున్నాడు. స్థానికులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్సై గోపి తెలిపారు.

జోర్డాన్లో అంబకంటి యువకుడు మృతి