
మోటార్సైకిల్ను ఢీకొట్టిన స్కూల్ బస్సు
తాండూర్: మండలంలోని రేచిని–గోపాల్నగర్ మూలమలుపు వద్ద బుధవారం మోటార్సైకిల్ను స్కూల్బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఓ మహిళ మృతిచెందింది. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. తాండూర్ ఎస్సై కిరణ్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. తాండూర్లోని సెయింట్ థెరి స్సా స్కూల్ బస్సు రెబ్బెన మండలం కిష్టాపూర్ గ్రా మం నుంచి విద్యార్థులను తీసుకొస్తుండగా రేచి ని–గోపాల్నగర్ మూలమలుపు వద్ద మోటార్సైకిల్ను ఎదురుగా ఢీకొట్టింది. దీంతో గోపాల్రావుపేట గ్రామానికి చెందిన పోగుల నానక్క, పీరిట్ల మారుతి తీవ్రంగా గాయపడ్డారు. వీరిని స్థానికులు బెల్లంపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. నానక్క(40) పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం కరీంనగర్కు తరలిస్తుండగా మార్గమధ్యంలో చనిపోయింది. ఈ ప్రమాదంలో బస్సులోని విద్యార్థులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.
కొడుకును పాఠశాలకు పంపేందుకు వచ్చి..
పోగుల నానక్క తన కుమారుడు అన్షిత్ను సెయింట్ థెరిస్సా పాఠశాలకు పంపేందుకు స్టేజీ వద్దకు వచ్చి బస్సు ఎక్కించి పంపించింది. ఇదే సమయంలో అదే గ్రామానికి చెందిన పీరిట్ల మారుతి యూరియా బస్తాల కోసం రేచినికి వెళ్తున్నాడు. విషయం తెలిసిన నానక్క తాను కూడా యూరియా కోసం వస్తానని మారుతి మోటార్సైకిల్పై వెళ్లింది. ఆ తర్వాత కొద్ది క్షణాల్లోనే బస్సు మృత్యు శకటమై ఢీకొట్టింది. నానక్కకు భర్త మల్లేష్, కుమారుడు ఉన్నారు.
పిల్లల ప్రాణాలతో చెలగాటం
సెయింట్ థెరిస్సా పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యపు పనితీరు, పర్యవేక్షణ లోపంతో విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతోందని పలువురు ఆరోపిస్తున్నారు. ఇటీవల స్కూల్ బస్సు డ్రైవర్ డ్రంకెన్డ్రైవ్లో పోలీసులకు చిక్కాడు. మద్యం సేవించి బస్సు నడుపుతున్నా పట్టించుకోకపోవడంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. అనుమతి లేకుండా హాస్టల్ నిర్వహించినా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోకపోవడం అనుమానాలకు తావిస్తోంది.

మోటార్సైకిల్ను ఢీకొట్టిన స్కూల్ బస్సు