
సాహిత్యంలో ‘అరుణ’ కిరణం!
● ఆకట్టుకుంటున్న బట్టువార్ బాల సాహిత్యం.. ● విద్యార్థుల్లో సాహిత్య బీజాలు నాటుతున్న ఉపాధ్యాయురాలు.. ● తాను రచిస్తూ.. పిల్లల్లో సాహిత్యం పెంపొందించేలా ప్రేరణ.. ● ఐదు భాషల్లో మధుర గేయాల పుస్తకాలు ముద్రణ ● సొంతంగా 1,937 కవితలు రాసిన టీచర్.. ● నేడు ‘తెలంగాణ సారస్వత పరిషత్’ ఆధ్వర్యంలో సన్మానం
ఇంద్రవెల్లి: ఆదిలాబాద్ జిల్లా భీంసరికి చెందిన ఉపాధ్యాయురాలు అరుణ బట్టువార్ ప్రాథమిక స్థాయి విద్యార్థులను బాల కవులు, సాహిత్యవేత్తలుగా తీర్చిదిద్దేందుకు విశేష కృషి చేస్తున్నారు. ప్రస్తుతం ఇంద్రవెల్లి జిల్లా పరిషత్ పాఠశాలలో సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయురాలిగా విధులు నిర్వహిస్తున్న ఆమె.. బాలల్లో సాహిత్య ఆసక్తిని పెంపొందిస్తున్నారు. ఆమె స్వయంగా 1,937 కవితలు రాసి, 10 సాహిత్య పుస్తకాలను ప్రచురించారు. విద్యార్థుల ద్వారా ఐదు భాషల్లో ఆరు బాల గేయ పుస్తకాలను ముద్రించారు. ఆమె సేవలను గుర్తించి, ‘తెలంగాణ సారస్వత పరిషత్’82వ స్థాపన దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లో ఆదివారం జరిగే బాల సాహిత్య సమ్మేళనంలో సన్మానించనుంది.
సాహిత్య సేవలకు గుర్తింపు
అరుణ బట్టువార్ 1997లో ఎంఏ, బీఎడ్ పూర్తి చేసి ఉపాధ్యాయ వృత్తిలోకి ప్రవేశించారు. కథలు, నాటికలు రాసి రేడియో ప్రోగ్రామ్ల ద్వారా ప్రసారం చే శారు. ఆమెకు విశ్వవిఖ్యాత గౌతమి నంది, ఎస్వీఆ ర్ డిజిటల్ అండ్ గౌతమేశ్వర కామధేను, ప్రైడ్ ఇండియా, కలం భూషణ్, సాహితీ కిరణం, గుడిహత్నూర్ బెస్ట్ టీచర్, సావిత్రిబాయి ఫూలే, చతుర్ముఖ సింహ, కథరత్న, మధుర కవయిత్రి వంటి అనేక అ వార్డులు లభించాయి. తెలుగు బుక్ ఆఫ్ రికార్డు, వి శ్వవిఖ్యాత కీర్తి, తెలుగు వెలుగు జాతీయ సాహిత్య పురస్కారాలు, ఆర్ఎస్ఎన్ సేవ ఫౌండేషన్ కవితా పురస్కారాలు కూడా ఆమె సొంతం చేసుకున్నారు.
ఐదు భాషల్లో బాల గేయాలు
అరుణ బట్టువార్ పనిచేసిన పాఠశాలల్లో విద్యార్థులతో కవితలు, సాహిత్య రచనలు చేయించారు. 2021–24 మధ్య గుడిహత్నూర్ మండలం మన్నూ ర్ ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తూ, విద్యార్థులతో తెలుగు, హిందీ, మరాఠీ, ఇంగ్లిష్ భాషల్లో గేయాలు రాయించారు. వాటిని ‘మన్నూర్ బాలల మధుర గేయాలు’, ‘మన్నూర్ చిల్డ్రన్స్ మెలోడీయస్ రైమ్స్’వంటి పుస్తకాలను ముద్రించారు. 2013లో సీతారాంగూడ పాఠశాలలో గొండి భాషలో ‘చుడూర్ కాండీరా... చుడూర్ పాటింగ్’గేయాల పుస్తకాన్ని రాయించారు. ఇంద్రవెల్లిలో గత విద్యా సంవత్సరంలో పదో తరగతి విద్యార్థులతో అలంకార కవితలు రాయించి పుస్తకం ముద్రించారు.
సాహిత్య బీజం నాటి..
అరుణ బట్టువార్ సాహిత్య ప్రతిభను విద్యార్థుల్లో నాటడం ద్వారా బాల సాహిత్యానికి కొత్త ఒరవడిని సృష్టిస్తున్నారు. ఆమె కృషిని జిల్లా వాసులు, తోటి ఉపాధ్యాయులు ప్రశంసిస్తున్నారు. ఆమె బోధన, సాహిత్య రచనలు భావి తరాలకు స్ఫూర్తిగా నిలుస్తాయి.
బాల కవులుగా తీర్చిదిద్దడమే లక్ష్యం
పిల్లల్లో సాహిత్యాన్ని పెంపొందిస్తాం. చక్కని కథలు, గేయాలు, వచన కవితలు రాసేటట్టు తర్పీదునిస్తాం. పిల్లలను బాల కవులుగా తీర్చిదిద్దడమే తన లక్ష్యం. సాహితీ పుస్తకాలు చదవడం, రాయడంతో నైపుణ్యం పెరుగుతుంది. – అరుణ బట్టువార్,
ఇంద్రవెల్లి జెడ్పీ పాఠశాల ఉపాధ్యాయురాలు
టీచర్ కృషితోనే..
తెలుగులో అలంకారాలు నేర్పుకోవడంలో టీచర్ సులువు పద్ధతి చెప్పేవారు. ఉదాహరణలు ఇస్తూ వాటి ద్వారా కవితలు రాయిస్తే గుర్తుంటాయని మాతో కవితలు రాయించేది. మొదట్లో కొంత తికమకపడ్డాం. మేడం సలహాలతో 20 మంది పదో తరగతి విద్యార్థులు వివిధ అలంకార కవితలు రాశాం. ఇలా రాయడంలో టీచర్ కృషి ఉంది.
– చంద్రకాంత్, మన్నూర్ పాఠశాల విద్యార్థి
పట్టు సాధించాం
టీచర్తోనే సాహిత్యం, బాలగేయం పరిచయమైంది. ఆమె ప్రోత్సాహంతో బాలగేయాలు రాసేవాళ్లం. అందులో తప్పులు సరిచేస్తూ మళ్లీ రాయించేది. ఇలా రాయడం ద్వారా సాహిత్యం, బాల గేయాలపై పట్టు సాధించగలిగాం. ఆంగ్ల బాలగేయ పుస్తకాన్ని ముద్రించగలిగాం. టీచర్ కృషితో ఇది సాధ్యమైంది.
– పెందోర్ లక్ష్మి, మన్నూర్ విద్యార్థిని
సంతోషించారు
గోండి భాషకు లిపి లేదు. మాతో గోండి భాషలో బా లగేయాలు రాయించాలని టీచర్ కృషి చేశారు. తెలు గులో చెబుతుంటే మేము గోండి భాషలో రాశాం. మా తప్పులు సరిచేస్తూ మళ్లీ రాయిస్తూ చక్కటి బాలగేయ పుస్తకాలను టీచర్తో కలిసి సమాజానికి అందించాం. మేం రాసిన పుస్తకం చదివి మా గ్రామస్తులు సంతోషించారు
– కినక గణేశ్, సీతారాంగూడ విద్యార్థి

సాహిత్యంలో ‘అరుణ’ కిరణం!

సాహిత్యంలో ‘అరుణ’ కిరణం!

సాహిత్యంలో ‘అరుణ’ కిరణం!

సాహిత్యంలో ‘అరుణ’ కిరణం!