
మలేషియాలో నృత్య ప్రదర్శనకు ఆహ్వానం
● నటరాజ కళాక్షేత్రం విద్యార్థులకు అవకాశం ● ఈనెల 27న ప్రదర్శన
జన్నారం: మలేషియాలో నృత్య ప్రదర్శన ఇచ్చేందుకు మండల కేంద్రంలోని నటరాజ కళాక్షేత్రానికి చెందిన విద్యార్థులకు అరుదైన అవకాశం లభించింది. మండల కేంద్రంలో చిన్నగా ప్రారంభమైన నటరాజ కళాక్షేత్రం అంతర్జాతీయ స్థాయిలో ప్రదర్శనకు ఎంపికవడంతో మండల వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈనెల 27న కూచిపూడి నృత్య ప్రదర్శన ఇచ్చేందుకు గురువారం మలేషియకు వెళ్లనున్నారు.
2017లో ప్రారంభం..
2017లో నటరాజ కళాక్షేత్రాన్ని కూచిపూడి నృత్యం, ఫోక్ డ్యాన్సులు నేర్పించేందుకు ముగ్గురితో ప్రారంభించారు. క్రమంగా విద్యార్థుల సంఖ్య పెరగడమే కాకుండా జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో ప్రదర్శనలు ఇచ్చి అనేక బహుమతులు పొందారు. ఇప్పటివరకు 1000 మందికి పైగా విద్యార్థులు కూచిపూడి నృత్యం నేర్చుకున్నారు. కూచిపూడిలో డాక్టరేట్ పొందిన మాస్టర్ నర్మద గౌడ్ నేతృత్వంలో రెండు బ్యాచ్లలో 20 మంది కూచిపూడి నృత్యంలో డిప్లొమా పూర్తి చేశారు. ప్రస్తుతం 26 మంది నటరాజ కళాక్షేత్రంలో నృత్యం నేర్చుకుంటున్నారు. కూచిపూడితో పాటుగా ఫోక్ పాటలపై కూడా డ్యాన్సులు నేర్చుకుని ప్రదర్శనలు ఇస్తూ పలువురి మన్ననలు పొందుతున్నారు.
27న మలేషియాలో ప్రదర్శన..
ప్రపంచ డ్యాన్స్ డే సందర్భంగా మలేషియాలో ఉద్యోగరీత్య స్థిరపడిన తమిళనాడుకు చెందిన ఆరుద్ర, నాట్య సమర్పణం ఆధ్వర్యంలో ఈనెల 27న నిర్వహించనున్న మలేషియా ఫెస్టివల్ కార్యక్రమంలో పాల్గొనేందుకు కొంతమంది డ్యాన్స్ మాస్టర్లకు ఆహ్వానం అందింది. అందులో తమిళనాడు రాష్ట్రం చైన్నె నుంచి కొందరు డ్యాన్స్ మాస్టర్లు, కర్ణాటక రాష్ట్రం బెంగుళూర్ నుంచి కొందరు, తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ నుంచి కొందరు ఎంపికయ్యారు. వీరితో పాటుగా జన్నారం మండలకేంద్రానికి చెందిన నటరాజ కళాక్షేత్రం డ్యాన్స్ మాస్టర్ నర్మదగౌడ్కు ఆహ్వానం అందింది. డ్యాన్స్ మాస్టర్ నర్మద గౌడ్తో పాటు 9 మంది విద్యార్థులు మలేషియాలో నృత్య ప్రదర్శన ఇవ్వనున్నారు. ఈ మేరకు 10 మంది నృత్య కళాకారులతో పాటుగా మరో 15 మంది తల్లిదండ్రులు గురువారం మలేషియాకు బయలు దేరనున్నారు.
మంచి పేరు తీసుకొస్తాం..
నటరాజ కళాక్షేత్రం అంతర్జాతీయ నృత్య ప్రదర్శనకు ఎంపికవడం చాలా గర్వంగా ఉంది. మా విద్యార్థులు మలేషియాలో కూచిపూడి నృత్య ప్రదర్శన చేయనున్నారు. అంతర్జాతీయ స్థాయిలో జన్నారం మండలానికి మంచి పేరు తీసుకొస్తాం.
– గాజుల నర్మదగౌడ్, డ్యాన్స్ మాస్టర్

మలేషియాలో నృత్య ప్రదర్శనకు ఆహ్వానం