స్టేషన్ మహబూబ్నగర్: క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయాలని డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్ అన్నారు. జిల్లాకేంద్రంలోని డీసీసీ కార్యాలయంలో గురువారం జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. పార్టీ బలోపేతం, గ్రామస్థాయి నుంచి జిల్లాస్థాయి వరకు నాయకులు, కార్యకర్తల మధ్య సమన్వయం పెంపొందించడం వంటి అంశాలపై చర్చించారు. పార్టీ కార్యక్రమాలు, సంస్థాగత వ్యవహారాలు, నాయకులు, కార్యకర్తల మధ్య సమన్వయం, గ్రామస్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేసే అంశాలపై చర్చించారు. పార్టీని బూత్స్థాయి నుంచి గ్రామ, మండల, అసెంబ్లీ స్థాయి వరకు బలోపేతం చేయడానికి కార్యాచరణ రూపొందించాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేయాలని నిర్ణయించారు.
బీజేపీ వస్తే అధికారికంగా విమోచన దినం
పాలమూరు: తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా గురువారం జిల్లా బీజేపీ కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్రెడ్డి జాతీయజెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ మొదటి నుంచి తెలంగాణకు స్వాతంత్య్రం వచ్చిన 1948 సెప్టెంబర్ 17ను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని అనేక పోరాటాలు చేస్తున్నట్లు తెలిపారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని, ఆ వెంటనే విమోచన దినం అధికారికంగా నిర్వహిస్తామని పేర్కొన్నారు. పద్మజారెడ్డి, అంజయ్య, వీర బ్రహ్మచారి, బాలరాజు, కృష్ణారెడ్డి, కార్పొరేటర్లు రమేష్, పాండురంగారెడ్డి, మర్రిజ్యోతి, రాజు, హరికృష్ణ పాల్గొన్నారు.
● ప్రధాని నరేంద్రమోదీ పుట్టినరోజు సందర్భంగా యువ మోర్చా ఆధ్వర్యంలో గురు వారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్రెడ్డి ప్రారంభించారు. రాత్రి 7 గంటలకు ఆశీస్సుల దీపం కార్యక్రమం సందర్భంగా ఇళ్లపై దీపాలు వెలిగించారు.
24 నుంచి జిల్లాస్థాయి ఎస్జీఎఫ్ పోటీలు
మహబూబ్నగర్ క్రీడలు: జిల్లాకేంద్రంలోని మెయిన్ స్టేడియంలో అండర్–14, అండర్–17 విభాగాలకు సంబంధించి ఈనెల 24వ తేదీన వాలీబాల్, 25వ తేదీన కబడ్డీ బాలబాలికల, 26న ఖోఖో బాలబాలికల మహబూబ్నగర్ జిల్లాస్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ టోర్నమెంట్ కమ్ సెలక్షన్స్ ఉంటాయని జిల్లా ఎస్జీఎఫ్ కార్యనిర్వాహక కార్యదర్శి వేణుగోపాల్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. మండలాల జట్లు ఆయా తేదీల్లో ఉదయం 9.30 గంటలకు రిపోర్టు చేయాలని కోరారు. మిగతా వివరాల కోసం 9948787711 నంబర్ను సంప్రదించాలని సూచించారు.


