అలంపూర్: అంతర్జాతీయ మ్యూజియం వారోత్సవాలు ఈ నెల 18 నుంచి నిర్వహిస్తున్నట్లు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా పురావస్తు శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ నాగలక్ష్మి తెలిపారు. ప్రజాపాలన– ప్రగతి ప్రణాళికలో భాగంగా రాష్ట్ర వారసత్వ శాఖ డైరెక్టర్ అర్జున్రావు ఆదేశాల మేరకు పర్యటక శాఖ, తెలంగాణ వారసత్వశాఖ సంయుక్త ఆధ్వర్యంలో వారం రోజులపాటు ప్రత్యేక వారోత్సవాల కార్యక్రమాలు ఉండనున్నట్లు పేర్కొన్నారు. ఉత్సవాల్లో భాగంగా మ్యూజియంలోకి సందర్శకులకు, పర్యాటకులకు ఉచిత ప్రవేశం ఉంటుందన్నారు. అదే విధంగా స్థానికంగా ఉన్న నరసింహస్వామి ఆలయం నుంచి అవగాహన ర్యాలీ నిర్వహిస్తామన్నారు. సందర్శకులకు, స్థానిక ప్రజలకు అలంపూర్ చరిత్ర ప్రాముఖ్యత, పురావస్తు విశేషాలు గురించి అధికారులు నిపుణులతో వివరించనున్నట్లు పేర్కొన్నారు. పూర్వీకుల వారసత్వాన్ని, సంస్కృతిని ప్రతిబింబించే కార్యక్రమాన్ని పర్యాటకులు, ప్రజలు, విద్యార్థులు హాజరై విజయవంతం చేయాలని కోరారు.


