గట్టు: తెలంగాణ సాంఘీక సంక్షేమ గురుకుల జూనియర్ కళాశాలలో ప్రవేశ పరీక్షకు సంబంధించిన ఇద్దరు విద్యార్థినులకు శుక్రవారం చేదు అనుభవం ఎదురైంది. గురుకుల జూనియర్ కళాశాల ప్రవేశం కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు పరీక్ష కేంద్రాన్ని మానవపాడు గురుకుల పాఠశాల గట్టు అని ఉండగా, పొరపాటున వారు తల్లిదండ్రులతో కలసి మానవపాడుకు చేరుకున్నారు. తీరా మానవపాడు గ్రామంలో గురుకుల పరీక్షా కేంద్రం లేదని విషయాన్ని తెలుసుకొని అక్కడి నుంచి గట్టులోనే ఉన్న మానవపాడు గురుకుల పరీక్ష కేంద్రానికి బైకుపై బయలు దేరారు. సుమారుగా 70 కిలో మీటర్లు ప్రయాణించి వీరు గట్టుకు చేరుకున్నారు. అయితే ఉదయం 10 గంటలకు పరీక్ష ప్రారంభం కావడంతో విద్యార్థినులు 10: 30 గంటలకు కేంద్రానికి చేరుకున్నారు. పొరపాటున మానవపాడుకు వెళ్లామని, పరీక్షా కేంద్రం విషయంలో అయోమయానికి గురైనట్లు విద్యార్థినుల తల్లిదండ్రులు తెలిపారు. అయినప్పటికీ అధికారులు విద్యార్థినులను పరీక్ష కేంద్రంలోకి అనుమతించకపోవడంతో విద్యార్థినులు బాధతో వెనుతిరిగి వెళ్లారు. గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రంలో 504 మంది విద్యార్థులకుగాను 492 మంది, గట్టులోనే ఉన్న మరో కేంద్రం మానవపాడు గురుకుల పాఠశాలలో 336 మంది విద్యార్థినులు ప్రవేశ పరీక్షలకు హాజరైనట్లు అధికారులు తెలిపారు.
మానవపాడు మండల కేంద్రం
అనుకొని అక్కడికి వెళ్లిన విద్యార్థులు
గట్టులోని మానవపాడు గురుకుల పాఠశాల కేంద్రానికి ఆలస్యంగా చేరిక
పరీక్ష కేంద్రంలోకి అనుమతించని అధికారులు


