మానవపాడు: పట్టపగలే ఓ ఇంట్లో చోరీ జరిగిన ఘటన మండలంలోని కొర్విపాడు గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికులు, గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన పరుశరాముడు రోజు మాదిరిగానే గురువారం ఉదయం ఇంటికి తాళం వేసి పొలానికి వెళ్లాడు. దీంతో దొంగలు తాళం పగులగొట్టి రూ.50వేలు నగదు, బంగారు కమ్మలు, పట్టీలు చోరీ చేశారు. సాయంత్రం గుర్తించిన బాధితుడు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయగా ఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ స్వాతి తెలిపారు.
సర్పంచ్ ఇంట్లో చోరీ
ఇటిక్యాల: సర్పంచ్ ఇంట్లో చోరీ జరిగిన ఘటన మండలంలోని ఉదండాపురంలో చోటు చెసుకుంది. బాధితుడు తెలిపిన కథనం మేరకు.. గ్రామానికి చెందిన సర్పంచ్ గొల్ల మహేష్ బుధవారం రాత్రి తన ఇంటి మేడపై నిద్రించాడు. ఈ క్రమంలో గురువారం తెల్లవారుజామున గుర్తు తెలియ ని దుండగులు ఇంట్లోకి ప్రవేశించి బీరువాలోని సుమారు రూ.2.7 లక్షల నగదు ఎత్తుకెళ్లారు. ఉదయం లేచి ఇంట్లోకి వెళ్లగా.. బీరువా తెరచి ఉండటం గమనించిన కుటుంబ సభ్యులు నగదు పోయిందని గుర్తించి పో లీసులకు ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న క్లూస్ టీం సిబ్బంది ఘటన స్ధలాన్ని చేరుకొని ఫింగర్ ప్రింట్స్ సేకరించారు.
40 బస్తాల రేషన్ బియ్యం పట్టివేత
రాజాపూర్: బాలానగర్ మండలంలోని మోతిఘనాపూర్ శివారులో అక్రమంగా తరలిస్తున్న 40 బస్తాల రేషన్ బియ్యాన్ని గురువారం స్వాధీనం చేసుకున్నట్లు బాలానగర్ ఎస్ఐ లెనిన్గౌడ్ తెలిపారు. మోతిఘనాపూర్ శివారులో అనుమానాస్పదంగా ఉన్న ఓ బొలేరో వాహనాన్ని పెట్రోలింగ్ సిబ్బంది తనిఖీ చేయగా అందులో ప్రభుత్వ బియ్యం ఉండటంతో ఎన్ఫోర్స్మెంట్ అధికారి రాగిణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని బియ్యంతో పాటు వాహనాన్ని స్వాధీనం చేసుకుని పోలీస్స్టేషన్కు తరలించామన్నారు.


