అలంపూర్: పట్టణంలో వెలిసిన హజ్రత్ షా అలీ పహిల్వాన్ ఉత్సవాలు మంగళవారంతో వైభవంగా ముగిశాయి. ఉత్సవాల చివరి రోజు మహిళల ప్రత్యేక ఉర్సు జరిగింది. ఈ నెల 9న గంధోత్సవంతో ఉత్సవాలు ప్రారంభించారు. 10న సర్ ముబారక్ దర్గాలో చిన్న కిస్తీ, 11న ధడ్ ముబారక్ దర్గాలో పెద్ద కిస్తీలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. భక్తులు కిస్తీలకు ప్రసాదం అందించి మొక్కులు తీర్చుకున్నారు. 12న ఉర్సులో వెలిసిన బ్యాంగిల్స్, బొమ్మల దుకాణాల వద్ద మహిళల కొనుగోళ్లతో రద్దీగా మారాయి. నాలుగు రోజులుగా భక్తుల రాకపోకలతో వీధులు కిటకిటలాడాయి. ఈ సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు. అధికారులు భక్తులకు కావాల్సిన సౌకర్యాలను కల్పించారు.


