జడ్చర్ల టౌన్: పట్టణంలోని ఆర్యసమాజం ఆధ్వర్యంలో దయానంద విద్యామందిరంలో వారం రోజులుగా నిర్వహిస్తున్న వేసవి యువ నిర్మాణ శిబిరం ఆదివారంతో ముగిసింది. మహబూబ్నగర్, నల్లగొండ, హైదరాబాద్, విజయవాడ ప్రాంతాల నుంచి మొత్తం 65 మంది శిబిరంలో పాల్గొన్నారు. శిబిరంలో హర్యాన నుంచి వచ్చిన శిక్షకులు కరెన్సీ, డింపుల్, బాలాజీ కర్రసాము, కత్తిసాము, డంబుల్స్, పిరమిడ్, కరాటే, భూమి నమస్కారం, సూర్యనమస్కారాలతో పాటు వ్యక్తిత్వ వికాసం, సమాజం, పెద్దలు, ఇతరులతో ఎలా మెలగాలి అనే అంశాలపై శిక్షణ ఇచ్చారు. అలాగే యజ్ఞాల వల్ల కలిగే ప్రయోజనాలు, భాష పట్ల పట్టు సాధించటం, ఆంగ్ల భాషలో ప్రావీణ్యంపైనా అవగాహన కల్పించారు. భజనలు, వేదోక్త ప్రవచనాలు, ధార్మిక సందేశాలతో భక్తిభావం పెంపొందింపజేశారు. విద్యార్థులకు ప్రతిభ పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. ముగింపు సందర్భంగా నిర్వహించిన సమావేవంలో ఆచార్య వేదసింధు పాల్గొని నైతిక విలువలతో కూడిన విద్యను అందిస్తున్న ఆర్యసమాజం గూర్చి వివరించారు. పితృభక్తి, మాతృభక్తి, గురు భక్తి, దేశభక్తి, దైవభక్తి అంశాలపై అవగాహన కల్పిస్తూ సందేశమిచ్చారు. కార్యక్రమంలో రాష్ట్ర సంగీత నాటక అకాడమి మాజీ చైర్మన్ బి.శివకుమార్, ఆర్యసమాజ ప్రతినిధులు ప్రభాకర్, శ్రీనివాసులు, గుబ్బనర్సింహులు, బక్క రాజేశ్వర్, డి.కృష్ణయ్య, బి. విజయ్కుమార్, గోనెల రాధాకృష్ణ, లావణ్య, ప్రవీణ్ పాల్గొన్నారు.
శిక్షణలో అనేక అంశాలు నేర్చుకున్న
వేసవి యువ నిర్మాణ శిబిరంలో అనేక అంశాలను నేర్చుకున్నా. ఇక్కడికి రాకముందు ఇతరులతో ఎట్లపడితే అట్ల ఉన్నా. ఇప్పుడు ఎవరితో ఎలా మెలగాలో పూర్తి అవగాహన వచ్చింది. అలాగే సూర్య నమస్కారాలపై మరింత ప్రావీణ్యత సంపాదించగలిగాను. కర్ర, కత్తి సాము లు కూడా నేర్చుకున్న. ఇలాంటి శిబిరాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటున్నాయి. – యోగానంద సాయి, ఇంటర్ విద్యార్థి, నల్లగొండ.
కర్రసాము, కత్తిసామునేర్చుకున్న
ఆర్యసమాజం ఆధ్వర్యంలో ఇక్కడ ప్రతి ఏటా వేసవిలో యువనిర్మాణ శిబిరం నిర్వహిస్తున్నారు. ఈ సారి శిబిరంలో టీచర్లు కర్రసాము, కత్తిసాముపై శిక్షణ ఇచ్చారు. రెండింటినీ నేను చాలా ఇష్టంగా నేర్చుకున్నా. సూర్య నమస్కారాలు అయితే మాకు ముందే నేర్పించారు. శిబిరంలో కొత్తగా భూమి నమస్కారాలు నేర్చుకున్నాను. – మణిశంకర్, దయానంద 7వ తరగతి విద్యార్థి.


