మన్ననూర్: అమ్రాబాద్–మన్ననూర్ ప్రధాన రహదారిలో జరిగిన ప్రమాదంలో రైతు మృతిచెందిన ఘటన ఆదివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మన్ననూర్లోని అంబేడ్కర్ కాలనీకి చెందిన పంబలి తిర్మలయ్య(68) వ్యక్తిగత పని నిమిత్తం బటకు వెళ్లి తిరిగి వస్తుండగా.. ఇంటికి కొద్ది దూరంలో కుమ్మరోనిపల్లికి చెందిన ఆర్టీసీ పీహెచ్బీ (ప్రైవేటు) డ్రైవర్ రాకేష్ బైక్తో వేగంగా వెనుక నుంచి వచ్చి ఢీ కొట్టాడు. తల వెనుకభాగం, కాలు, చేతులకు తీవ్రగాయాలు కావడంతో సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. వైద్యసిబ్బంది వైద్యం అందించే విషయంలో నిర్లక్ష్యం వహించడంతో మృతిచెందాడనే ఆరోపణలు ఉన్నాయి. అయతే ఘటన జరిగిన వెంటనే బాధితులు 108 అంబులెన్స్కు ఫోన్ చేశారు. అప్పటికే స్వల్పగాయాలతో ఉన్న రాకేష్తో ఉన్న అంబులెన్స్ ఆస్పత్రి వద్దకు వేగంగా వెళ్లిపోయినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఆస్పత్రి, 108 అంబులెన్స్ సిబ్బంది నిర్లక్ష్యం వల్లనే తిర్మలయ్య మృతిచెందాడని ఆవేశానికి గురైన బంధువులు ఆస్పపత్రి ఆవరణలో ఆందోళనకు దిగారు. అమ్రాబాద్ పోలీసులు ఆందోళనకారులను శాంతింపజేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అచ్చంపేట ఆస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య బాలకిష్టమ్మతోపాటు కూతురు, కుమారుడు ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అమ్రాబాద్ ఎస్ఐ హన్మంత్రెడ్డి తెలిపారు.


