జడ్చర్ల: జడ్చర్ల పత్తి మార్కెట్యార్డులో ఏర్పాటు చేసిన మార్క్ఫెడ్ మొక్కజొన్న కొనుగోలు కేంద్రం వద్ద గురువారం రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రానికి మొక్కజొన్నను తీసుకువచ్చి నెల రోజులకు పైగా గడుస్తున్నా కొనుగోళ్లు చేయకపోవడంపై మండిపడ్డారు. కొందరివి తూకాలు వేసినా లారీలలో సంబంధిత గోదాములకు తరలించడంలో ఆలస్యం చేయడంతో తాము రేయింబవళ్లు బస్తాలు, కుప్పల వద్దే పడిగాపులు పడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న జిల్లా మర్కెటింగ్ అధికారిని బాలమణి, తహసీల్దార్ నర్సింగరావు, డీసీఓ కృష్ణ, తదితరులు మార్కెట్ యార్డుకు చేరుకుని రైతులకు నచ్చజెప్పారు. సంబంధిత సీఈఓ యాదగిరితో మాట్లాడి పరిస్థితిని అంచనా వేశారు. రైతులు ఆందోళన చెందాల్సిన పనిలేదని, వెంటనే లారీలను ఏర్పాటు చేసి తూకం వేసిన బస్తాలను త్వరితగతిన గోదాములకు తరలించే విధంగా చర్యలు చేపడుతామని హామీ ఇచ్చారు.


