జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): ప్రజావాణిలో అర్జిదారుల నుంచి స్వీకరించిన దరఖాస్తుల సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఖుష్బూ గుప్తా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని సమావేశం మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. అర్జిదారుల సమస్యలను పరిష్కరించడానికి జిల్లా యంత్రాంగం తప్పకుండా తగిన చర్యలు తీసుకుంటుందని కలెక్టర్ భరోసా ఇచ్చారు. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను అధికారులు నిశితంగా పరిశీలించి, సమస్యను అర్థం చేసుకొని పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఎట్టి పరిస్థితులలో దరఖాస్తులను పెండింగ్లో ఉంచరాదని, నిర్దేశించిన సమయంలో పరిష్కరించాలని అధికారులను ఆమె ఆదేశించారు. ఈ వారం ప్రజావాణికి 116 వినతులు వచ్చాయి.
● కారుణ్య నియామకాలకు సంబంధించి ఖాళీ పో స్టుల వివరాలను మే 10 లోగా పంపించాలని కలెక్ట ర్ తెలిపారు. ఖాళీ పోస్టుల వివరాలను అన్ని శాఖల అధికారులు తమతమ శాఖల్లో ఉన్న ఆఫీస్ సబార్డినేట్, రికార్డ్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, ఖాళీ పోస్టుల వివరాలను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కేటగిరీల రోస్టర్ వారీగా నిర్ణీత ఫార్మాట్లో కలెక్టరే ట్ పరిపాలన అధికారికి సమర్పించాలని సూచించా రు. సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ జేఎల్బీ హరిప్రియ, డీఆర్ఓ రాంరెడ్డి, డీఆర్డీఓ నర్సింహులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
ప్రతి నెల మొదటి బుధవారం దివ్యాంగుల ప్రజావాణి
జిల్లాలోని దివ్యాంగుల, వయో వృద్ధుల వెసులుబాటు కోసం ప్రతి నెల మొదటి బుధవారం ప్రత్యేక ప్రజావాణిని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ఖుష్బూ గుప్తా సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. మహబూబ్నగర్ అర్బన్ తహసీల్దార్ కార్యాలయంలో ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంటల వరకు ఈ ప్రజావాణి ఉంటుందని, దివ్యాంగులు, వయోవృద్ధులు ఈ సదావకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.


