మహబూబ్నగర్ క్రైం: జిల్లాలో దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న కేసులను త్వరగా పరిష్కరించడం చాలా అవసరం అని, ప్రధానంగా కోర్టు విచారణలో ఉన్న కేసులు ఆలస్యం కాకుండా శిక్షలు పడేవిధంగా చూడాలని ఎస్పీ డి.జానకి అన్నారు. ఎస్పీ కార్యాలయంలోని సమావేశ మందిరంలో శనివారం కోర్టు డ్యూటీ అధికారులతో పాటు కోర్టు లైజన్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. విచారణ కేసుల్లో సాక్ష్యులను సమయానికి హాజరుపరచడం, వారితో సమన్వయం కొనసాగించడం, చార్జీషిట్లను సకాలంలో కోర్టుకు అందించాలని సూచించారు. ప్రతి కేసులో ఫాలోఅప్ చర్యలు క్రమం తప్పకుండా పర్యవేక్షించాలని, కోర్టు తేదీలను కచ్చితంగా ట్రాక్ చేయాలన్నారు. సాక్ష్యుల హాజరు విషయంలో ఎలాంటి లోపాలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. కోర్టు పనుల్లో నిర్లక్ష్యం చేయడం వల్ల కేసుల పరిష్కారం ఆలస్యం అవుతుందని, ప్రతి అధికారి తమ విధులను క్రమశిక్షణతో సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. కోర్టు లైజన్ అధికారులు, డ్యూటీ అధికారులు పోలీస్స్టేషన్–కోర్టుల మధ్య సమన్వయం బలోపేతం చేయాలన్నారు. అవసరం అయిన పత్రాలు, చార్జిషీట్లు, సాక్ష్యాధారాలు సమయానికి అందేలా టెక్నాలజీ వినియోగంతో కేసుల ప్రగతిని సమీక్షించాలన్నారు. సమావేశంలో ఏఎస్పీ ఎన్బీ రత్నం, డీసీఆర్బీ సీఐ నర్సింహులు పాల్గొన్నారు.


