అడ్డాకుల: కారు అదుపు తప్పి సిమెంట్ దిమ్మెలను ఢీకొట్టిన ఘటన 44వ జాతీయ రహదారిపై జానంపేట శివారులో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్ణాటకకు చెందిన ముగ్గురు వ్యక్తులు ఢిల్లీ నుంచి బెంగళూర్కు ఇన్నోవాలో వెళ్తున్నారు. ఈ క్రమంలో బుధవారం అర్ధరాత్రి తర్వాత వారు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి జానంపేట దాటిన తర్వాత అచ్చాయపల్లి స్టేజీ సమీపంలో సర్వీసు రోడ్డు పనులు జరిగే చోట రోడ్డు పక్కనే ఉన్న సిమెంట్ దిమ్మెలను ఢీకొట్టుకుంది. దీంతో కారు రోడ్డు కిందకు దూసుకెళ్లి కల్వర్టు మీదుగా కిందకు వెళ్లి ఆగిపోయింది. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం తీవ్రంగా దెబ్బతినగా.. అందులో ప్రయాణిస్తున్న ముగ్గురు సురక్షితంగా బయటపడ్డారు. ఇదిలా ఉండగా జానంపేట వద్ద అండర్ బ్రిడ్జి పనులు జరిగే చోట సర్వీసు రోడ్డుపై సిమెంటు దిమ్మెలను అడ్డదిడ్డంగా ఉంచడంతో వాహనదారులు అయోమయానికి గురై ప్రమాదాలకు గురవుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. సర్వీసు రోడ్డుపై సరైన రక్షణ చర్యలు సైతం చేపట్టడం లేదని వాపోతున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు.


