మహబూబ్నగర్ (వ్యవసాయం): విదేశీ వాణిజ్య ఒప్పందాల ను దొడ్డిదారిన కాకుండా ప్రజా సమక్షంలో పారదర్శకంగా చేసుకోవాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి టి.సాగర్ డిమాండ్ చేశారు. ఇలాంటి ఒప్పందాల వల్ల దేశ వ్యవసాయ రంగానికి తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అమెరికా, భారత్ వాణిజ్య ఒప్పందం ‘భారత వ్యవసాయంపై ప్రభావం’ అంశంపై బుధవారం జిల్లా కేంద్రంలో సెమినార్ నిర్వహంచారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. అమెరికాతో కుదిరిన వాణిజ్య ఒప్పందాల వల్ల విదేశీ ఉత్పత్తులను సున్నా సుంకంతో దిగుమతి చేసుకోవడం వల్ల స్వదేశీ రైతులు నష్టపోతున్నారన్నారు. ముఖ్యంగా పత్తి దిగుమతులపై సుంకం తగ్గించడం వల్ల సుమారు 40 లక్షల మంది పత్తి రైతులు నష్టపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. మొక్కజొన్నకు మద్దతు ధర ప్రకటించినప్పటికీ కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడం వల్ల రైతులు ప్రైవేట్ వ్యాపారులకు అమ్మి నష్టపోతున్నారని వాపోయా రు. పాల ఉత్పత్తులపై సుంకాలు తొలగించి విదేశి దిగుమతులకు అవకాశం ఇవ్వాలనే ఆలోచన కూడా పాడి రైతులకు ప్రమాదకరమని హెచ్చరించారు.
ఆర్థిక సంక్షోభం తప్పదు
అంతర్జాతీయ రాజకీయాలు, యుద్ధాలు ఆర్థిక ప్రయోజనాల కోసమే జరుగుతున్నాయని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర మహాసభల ఆహ్వాన సంఘం అధ్యక్షుడు డాక్టర్ మధుసూదన్రెడ్డి వాఖ్యానించారు. ఇరాన్పై యుద్ధం వల్ల అమెరికాకు లాభం కంటే నష్టమే ఎక్కువగా ఉంటుందని, ఆర్థిక సంక్షోభం తలెత్తే అవకాశాలు ఉన్నాయన్నారు. మిగులు ఉత్పత్తులను విక్రయించేందుకు యుద్ధాలను ప్రోత్సహించడం దురదృష్టకరమని విమర్శించారు. యుద్ధాల్లో అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని, యుద్ధ నైతికతను పక్కనబెట్టి దాడులు చేయడం సరికాదన్నారు. కార్యక్రమంలో రాములు, కిల్లె గోపాల్, జగన్, కడియాల మోహన్, రాంరెడ్డి, మల్లెల మాణిక్యంరాజు, మీసాల కుర్మయ్య, చంద్రకాంత్, సత్తయ్య, రాజ్కుమార్, రామదాస్, ఖమర్ అలీ, ప్రశాంత్, భానుప్రసాద్, ఆది విష్ణు, గాలన్న, రాములు, శివలీల, ఖయ్యూం, సురేష్, ఈశ్వర్ పాల్గొన్నారు.


