పాలమూరు: సాధారణ వ్యక్తుల నుంచి ఉద్యోగుల వరకు ప్రతి ఒక్కరిలో ఒత్తిడి పెరిగిందని, ఈ క్రమంలో నాణ్యమైన ఆహారం, నిత్యం వాకింగ్, యోగా, ధ్యానం చేయాలని, ఆరోగ్యంగా ఉండటం అంటే శారీరకంగా మానసికంగా భావోద్వేగపరంగా సంతోషంగా ఉండటం అని జిల్లా వైద్యారోగ్యశాఖ డాక్టర్ కృష్ణ అన్నారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో పాత డీఎంహెచ్ఓ కార్యాలయం దగ్గర ఏర్పాటు చేసిన ర్యాలీని డీఎంహెచ్ఓ పాటు 56 డివిజన్ కార్పొరేటర్ ఫర్హాత్ బేగం ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ ప్రస్తుత జీవన విధానంలో ప్రతి ఒక్కరికి ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ కలిగి ఉండాలని సూచించారు. అందుకోసం ఆరోగ్యకమైన జీవన విధానం అలవర్చుకోవాలన్నారు. వైద్యారోగ్యశాఖలో పని చేసే సిబ్బంది సైతం ముందుగా వ్యక్తిగత ఆరోగ్యంపై దృష్టిసారించాలన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ శశికాంత్, ప్రోగ్రామ్ అధికారులు శివకాంత్, పులి విద్య, మంజుల,హెల్త్ ఎడ్యుకేటర్లు హన్మంతు, నాగరాజు శెట్టి, సుభాష్, పట్టణ ఆరోగ్య వైద్యాధికారులు పాల్గొన్నారు.


