● డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్
స్టేషన్ మహబూబ్నగర్: సామాజిక సమీకరణాల మేరకు అన్ని వర్గాలకు అవకాశం లభించేలా జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యవర్గాన్ని ఎంపిక చేసినట్లు డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్ అన్నారు. జిల్లాకేంద్రంలోని కాంగ్రెస్ కార్యాలయంలో సోమవారం ఆయన 73 మందితో కూడిన డీసీసీ కమిటీ నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని ఎమ్మెల్యేలు, నాయకులతో చర్చించి వారి అభిప్రాయాలు తీసుకొని టీపీసీసీ చీఫ్ మహేష్కుమార్గౌడ్ ఆమోదంతో డీసీసీ కమిటీని ప్రకటించినట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి కష్టపడి పనిచేస్తున్న, జెండాలు మోసిన వారికి కమిటీలో చోటు కల్పించినట్లు తెలిపారు. డీసీసీ ఉపాధ్యక్షులుగా వేముల కృష్ణయ్య, బి.మధుసూదన్రెడ్డి, ఎన్.లక్ష్మినారాయణ, ఎం.వెంకట నర్సింహారెడ్డి, పోలేపల్లి యాదయ్య, సయ్యద్ మిన్హాజుద్దీన్, విష్ణువర్ధన్రెడ్డిను ఎంపిక చేసినట్లు తెలిపారు. కోశాధికారిగా జి.రాజేందర్రెడ్డి, అధికార ప్రతినిధులుగా కంచిమి లక్ష్మణ్, బాల నర్సింలు, జీడీ నిత్యానందన్లను ఎంపిక చేశామని, అదేవిధంగా జిల్లా ప్రధాన కార్యదర్శులుగా 21 మంది, జిల్లా కార్యదర్శులుగా 22 మంది, ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా 19 మందిని ఎంపిక చేశారు. ఈ జంబో డీసీసీ కమిటీలో ఉపాధ్యక్షులుగా నలుగురిని బడుగు, బలహీన వర్గాలకు, ముగ్గురిని రెడ్డి వర్గానికి ఎంపిక చేయగా మిగతా జిల్లా ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, ఎగ్జిక్యూటివ్ మెంబర్లలో అధికంగా బడుగు, బలహీనవర్గాల వారిని ఎంపిక చేయడం విశేషం.
నేడు టీపీసీసీ
అధ్యక్షుడి రాక
టీపీసీసీ అధ్యక్షుడు మహేష్కుమార్గౌడ్ మంగళవారం జిల్లాకు రానున్నట్లు సంజీవ్ ముదిరాజ్ వెల్లడించారు. ఆయనకు స్థానిక మెట్టుగడ్డ నుంచి ఘనంగా స్వాగతం పలుకుతామని తెలిపారు. మధ్యాహ్నం 3 గంటలకు పార్టీ కార్యాలయంలో కార్యవర్గంతో సమావేశం, అనంతరం శాలీమార్ ఫంక్షన్హాల్లో మూడు అసెంబ్లీ నియోజకవర్గాల నాయకులు, కార్యకర్తలతో సమావేశమవుతారని పేర్కొన్నారు. సమావేశంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఏపీ మిథున్రెడ్డి, అధికార ప్రతినిధి జహీర్ అఖ్తర్, మీడియాసెల్ కన్వీనర్ సీజే బెనహర్, నాయకులు కంచిమి లక్ష్మణ్, గోనెల శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.


