సాగునీరు అందాలంటే కాపలా కాయాల్సిందే..
కేఎల్ఐ సాగునీరు తమ పొలాలకు అందాలంటే అన్నదాతలు కాల్వ గట్టుపై కాపలాగా పడుకోవాల్సిన దుస్థితి వస్తోంది. కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో భాగంగా తిమ్మాజీపేట మండలంలోని ఆవంచ నుంచి వచ్చే డీ 82 కాల్వ కల్వకుర్తి మండలంలోని తాండ్ర మీదుగా పారుతోంది. కానీ మండలంలోని తర్నికల్ వద్ద నీరు దిగువకు వెళ్లకుండా ఎగువ ఆయకట్టు రైతులు ఇష్టానురీతిగా వ్యవహరిస్తుండడంతో పంజుగుల, సీలార్పల్లి, మొకురాల, ఎల్లికల్, తిమ్మరాసిపల్లి, జంగారెడ్డిపల్లిలోని ఆయకట్టు పొలాలకు సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నాయి. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో మొకురాల గ్రామానికి చెందిన యువ రైతులు రాత్రి వేళలో తర్నికల్ శివారులో కాల్వ గట్టుపై నిద్రిస్తూ సాగునీరు దిగువకు వెళ్లేలా చూసుకుంటున్నారు. అధికారులు స్పందించి తమ కష్టాలు తొలగించాలని వారు వేడుకుంటున్నారు.
– కల్వకుర్తి రూరల్
మెట్టుగడ్డ: ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం వలన మానవ మనుగడకు ముప్పు వాటిల్లుతుందని, మౌనం వహిస్తున్న ప్రపంచ దేశాలు యుద్ధాన్ని ఆపేందుకు చొరవ చూపాలని ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు. ఆదివారం స్థానిక పారిశ్రామిక వాడలోని సీనియర్ సిటిజన్ ఫోరం కార్యాలయంలో పాలమూరు అధ్యయన వేదిక ఆధ్వర్యంలో ప్రపంచ శాంతి కోసం ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దురాక్రమణ యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ నిర్వహించిన సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. మానవ చరిత్రలో అమెరికా నిర్మాణమే ఒక దుర్మార్గమైన ఆలోచనలతో కూడుకున్నదని, ఈ యుద్ధంతో ప్రపంచ దేశాలు తామంటే భయంతో ఉండాలన్న సంకేతం ఇస్తున్నట్లుగా ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ఖనిజ వనరుల కోసం చేస్తున్న విధ్వంసాన్ని సృష్టించి మహిళలను, పసిపిల్లలను బలి తీసుకుంటున్నారని ఆరోపించారు. ఇరాన్ ఉగ్రవాదాన్ని పోషిస్తుందని ఆరోపిస్తూ యుద్ధం చేయడం, అమాయకుల ప్రాణాలు తీయడం కూడా ఒక ఉగ్రవాదమే కదా అని ఆయన విమర్శించారు. నేడు దేశం ఎదుర్కొంటున్న ఇంధనం, ఆర్థిక సంక్షోభానికి అమెరికా సామ్రాజ్యావాదమే కారణమని దుయ్యబట్టారు. కార్యక్రమంలో రచయిత కల్లూరి భాస్కర్, రాఘవాచారి, సీనియర్ సిటిజన్ ఫోరం అధ్యక్షుడు జగపతిరావు, తిమ్మప్ప, వెంకట్రాములు తదితరులు పాల్గొన్నారు.


