భూత్పూర్: మున్సిపాలిటీలోని అమిస్తాపూర్ వద్ద చేపడుతున్న జాతీయ రహదారి ఎన్హెచ్–167ఎన్ పనులను ఆదివారం గ్రామస్తులు అడ్డగించారు. నాలగు వరుసల రహదారి పనులు చేపడుతుండటంతో మహబూబ్నగర్ వెళ్లే దారిలో ముస్లింలకు చెందిన శ్మశానవాటిక ఉండటంతో ఆటంక పరుచకుండా బీటీరోడ్డు వేస్తున్నారు. గ్రామానికి చెందిన కొందరు పెద్దలు రెండు వైపులా సమానంగా రహ దారి పనులు చేపట్టాలని, ఒకవైపు రెండు వరుస లు, మహబూబ్నగర్ వెళ్లే దారిలో ఒక వరుస బీటీ దారి ఏంటని ప్రశ్నించారు. శ్మశానవాటికపై గ్రామ పెద్దలతో మాట్లాడి నిర్ణయం వచ్చాకనే పనులు చేపట్టాలని కాంట్రాక్టర్కు చెందిన సూపర్వైజర్కు తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు రహదారి కాంట్రాక్టర్, గ్రామ పెద్దలతో మాట్లాడారు.
తువ్వగుట్టలో
చిరుత సంచారం
మహబూబ్నగర్ రూరల్: మండలంలోని రామచంద్రాపూర్ సమీపంలోని తువ్వగుట్టలో ఆదివారం చిరుత సంచారం కలకలం రేపింది. పటేల్ చెరువు వద్ద గల గుట్టపై చిరుత కనిపించినట్లు స్థానికులు తెలిపారు. గుట్టపై చిరుత తిరుగుతుండటంతో రైతులు, గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. ప్రతిరోజూ పొలాలకు వెళ్లే రైతులు చిరుత సంచారం వల్ల భయంతో పనులకు వెళ్లడానికి సంకోచిస్తున్న పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా పశువులను మేపేందుకు వెళ్లే కాపరులు మరింత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిరుత సంచారం గురించి అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చినప్పటికీ, వారు వెంటనే స్పందించడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. పరిస్థితిని గమనించి తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇదిలా ఉండగా ఫారెస్టు అధికారులు స్పందిస్తూ చిరుత సంచరిస్తున్న ప్రదేశాన్ని పరిశీలించినట్లు తెలిపారు. అది అటవీ ప్రాంతానికి చెందిన గుట్ట అని, గ్రామ ప్రజలు అనవసరంగా భయపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. అయినప్పటికీ గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. చిరుత సంచారం నేపథ్యంలో గ్రామ పరిసర ప్రాంతాల్లో అటవీ శాఖ గస్తీ పెంచాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.


