● రేపటి నుంచి గురులోక మాసంద్ జాతర ప్రారంభం
● డీఎస్సీతో పాటు 10 మంది సీఐలు,15 మంది ఎస్ఐలతో బందోబస్తు
కొత్తపల్లి: గిరిజనుల జీవన విధానంలో తన బోధనల ద్వారా మార్పు తీసుకొచ్చి, ఆపద సమయంలో వారిని ఆదుకున్న గురులోకామాసంద్ ప్రభు (బావాజీ)ని గిరుజనులు ఆరాధ్య దైవంగా భావిస్తారు. ఈ క్రమంలోనే అయన పుట్టిన రోజు (చైత్ర శుద్ధ పౌర్ణమి)ను పురస్కరించుకొని గిరిజనులు ప్రతి ఏటా కనులపండువగా ఉత్సవాలు నిర్వహిస్తారు. నారాయణపేట జిల్లా కొత్తపల్లి మండలంలోని తిమ్మారెడ్డిపల్లిలో గురులోకామాసంద్ ప్రభు ఆలయంలో మార్చి 1 నుంచి 4 వరకు కొనసాగనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. చైత్ర శుద్ధ చతుర్ధశి బుధవారం నుంచి చైత్ర బహుళ విదియ మొదటి రోజు 1న ధ్వజారోహణం (అర్థాస్) రాత్రి ప్రభోత్సవం, బంజారాల సంస్కృతి కార్యక్రమాలు, 2న గురులోకామాసంద్ ప్రభుకు, ఆంజనేయస్వామికి ప్రత్యేక పూజలు, రాత్రి 2గంటలకు రఽథోత్సవం (తేరు), 3న మహాభోగ్, ప్రభువారి పల్లకీసేవ, కాళికాదేవి వద్ద భక్తుల మొక్కుల చెల్లింపులు, 4న కాళికాదేవి పల్లకీ సేవ, హోమం, పూర్ణాహుతి, మంగళ హారతి కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు ఆలయ పూజారులు తెలిపారు. ఉత్సవాలకు తెలంగాణతో పాటు కర్ణాటక, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల నుంచి గిరిజన భక్తులు హాజరై ప్రభును ఆరాధిస్తారు.
ఏర్పాట్లు పూర్తి
ఉత్సవాల ఏర్పాటు కోసం గత నెల 17న కలెక్టర్ సిక్తా పట్నాయక్, కడా ప్రత్యేకాధికారి వెంకట్రెడ్డి వివిధ శాఖల అధికారులతో ఆలయం ఆవరణలో సమావేశం నిర్వహించారు. అలాగే ఈ నెల 28న కలెక్టర్ ప్రతీక్ జైన్ మరోసారి అధికారులతో సమీక్షతో పాటు, ఏర్పాట్లను పరిశీలించి తగు సూచనలు చేశారు. జాతర జరిగే నాలుగు రోజులు జిల్లా అధికారులు పర్యవేక్షించనున్నారు. ఉత్సవాల్లో పారిశుద్ధ్య పనులు, తాగునీటి సరఫరా తదితర ఏర్పాట్ల కోసం 500 మంది సిబ్బంది ఉపయోగిస్తున్నట్లు డీపీఓ సుధాకర్రెడ్డి తెలిపారు. జాతరను 12 సెక్టార్లుగా విభజించి ఒక్కో సెక్టార్ ఇన్చార్జ్గా ఎంపీఓ వ్యవహరిస్తారన్నారు.ఉత్సవాల్లో సమస్యలపై ఫి ర్యాదుల చేయడానికి 2 కంట్రోల్ రూంలను ప్రారంభించామని కోస్గి సీఐ సైదులు తెలిపారు. అలాగే షీటీంలు, మఫ్టీలో పోలీసులు, పోలీస్ పెట్రోలింగ్, ట్రాఫిక్, ఇతర బందోబస్తుకు పోలీసులను నియమిస్తున్నట్లు ఆయన తెలిపారు. జాతరలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా నారాయణపేట డీఎస్సీ లింగయ్య పర్యవేక్షణలో 10 మంది సీఐలు, 15 మంది ఎస్ఐలు, 36 మంది హెడ్కానిస్టేబుళ్లు, 200 మంది పోలీసులు, 53 మంది హోంగార్డులు విధులు నిర్వహించనున్నారు. గ్రామంలోని ఇళ్లలో ఎవరైనా మద్యం అమ్మకాలు సాగిస్తే వారిపై కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.


