కల్వకుర్తి టౌన్: కల్వకుర్తికి దక్కాల్సిన నీటి కేటాయింపులో రాజీ పడే ప్రసక్తే లేదని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. మంగళవారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. శ్రీశైలం ప్రాజెక్టులో నిబంధనలకు విరుద్ధంగా ఏపీ ప్రభుత్వం విద్యుత్తు ఉత్పత్తి చేస్తుందని, శ్రీశైలం జలాశయంలో కనిష్ఠ నీటిమట్టం 20 టీఎంసీలు ఉన్నప్పుడు కూడా ఇక్కడి వారి సాగు తాగునీటి అవసరాలను పట్టించుకోకుండా ఏపీ ప్రభుత్వం అన్యాయంగా నీటిని వినియోగిస్తుందని విమర్శించారు. ఈ విషయంపై పలుమార్లు విన్నవించినప్పటికీ స్పందన లేకపోవడంతో, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా రైతులు శ్రీశైలం వద్ద ధర్నా కార్యక్రమానికి పిలుపునివ్వడంతో ఏపీ ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేసిందన్నారు. కల్వకుర్తి ప్రజల ప్రయోజనాలే తమకు ముఖ్యమని నీటి కేటాయింపుల విషయంలో ఎలాంటి రాజీ ఉండదని స్పష్టం చేశారు. కల్వకుర్తికి నష్టం జరిగితే ప్రభుత్వం రైతుల పక్షాన నిలబడి పోరాడుతుందని భవిష్యత్లో ఇలాంటి చర్యలు పునరావృత్తమైతే కఠినంగా ఎదుర్కొంటామన్నారు. సమావేశంలో మున్సిపల్ చైర్పర్సన్ రత్నమాల, వైస్ చైర్మన్ షాన్వాజ్ ఖాన్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ మనీలా సంజీవ్ కుమార్ యాదవ్, మాజీ సర్పంచ్ ఆనంద్ కుమార్, మాజీ జెడ్పీటీసీ అశోక్ రెడ్డి, కౌన్సిలర్లు రాజేష్ కుమార్, కరుణాకర్ రెడ్డి, మార్కెట్ డైరెక్టర్ రమాకాంత్ రెడ్డి పాల్గొన్నారు.


