ధన్వాడ: మండల కేంద్రంలో శనివారం ఛత్రపతి శివాజీ మహరాజ్ విగ్రహావిష్కరణ శనివారం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ, కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి, బీజ్వార్ పీఠాధిపతి ఆదిత్య పరాశ్రీ స్వామిజీ ముఖ్య అతిథులుగా హాజరై ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో ఎంపీ మాట్లాడుతూ.. ధన్వాడలో శివాజీ విగ్రహ ఏర్పాటు చేయకుండా కొందరు 15 ఏళ్లుగా అడ్డుకుంటున్నారన్నారు. తనతో పాటు స్థానిక ఎమ్మెల్యే పర్ణికారెడ్డి సంపూర్ణ సహకారం అందించడంతోనే విగ్రహ ఏర్పాటు పూర్తయిందన్నారు. తన స్వగ్రామంలో శివాజీ మహరాజ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. ఆయన ధర్మస్థాపన కోసం ఎంతో కృషి చేశారని.. ప్రజలను పీడిస్తున్న వారిని వేటాడి వెంటాడి మట్టుపెట్టారని కొనియాడారు. నేటితరం పిల్లలకు సనాతన ధర్మాన్ని వివరించాలని సూచించారు. 2047లోగా దేశాన్ని వికసిత్ భరత్గా మార్చేందుకు ప్రధాని నరేంద్రమోదీ కృషి చేస్తున్నారన్నారు. కామారెడ్డిలో మాజీ సీఎం, ప్రస్తుత సీఎంను ఓడించిన ఘనత ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డికే దక్కిందని అన్నారు. అనంతరం ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి, ఆదిత్య పరాశ్రీ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ శివాజీ మహరాజ్ అడుగుజాడలో నడిచి ధర్మాన్ని పాటించాలని కోరారు. కార్యక్రమంలో సర్పంచ్ జ్యోతి రాంచంద్రయ్య, బీజేపీ జిల్లా అధ్యక్షుడు సత్యయాదవ్, మాజీ అధ్యక్షుడు శ్రీనివాసులు, హిందూవాహిని జిల్లా అధ్యక్షుడు సుదర్శన్గౌడ్, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు ఉమేష్, మాజీ ఉపాధ్యక్షుడు మల్లయ్య, నాయకులు ఉదయభాను, మల్లయ్య, గోవర్ధన్గౌడ్, మండల అధ్యక్షుడు శివరాజ్, మాజీ అధ్యక్షుడు మాకం సురేందర్, సర్పంచులు కొండయ్య, రవికుమార్, బీజేవైఎం నాయకుడు ప్రవీణ్కుమార్, ఉపసర్పంచ్ నర్సింహులు పాల్గొన్నారు.


