జడ్చర్ల: పెట్రోల్, డీజిల్ కొరత నెలకొన్న నేపథ్యంలో ఓ పెట్రోల్బంక్ వద్ద బ్యారల్స్, ట్యాంక్ల్లో డీజిల్ నిల్వ ఉండటంతో స్థానికులు జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారులు, స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన జడ్చర్ల మున్సిపాలిటీలో శనివారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. పట్టణ శివారులోని కిష్టంపల్లి సమీపంలో ఉన్న ప్రకాశ్ ఫిల్లింగ్ స్టేషన్ ఆవరణలో ఒక సింటెక్స్ ట్యాంకులో 2వేల లీటర్ల డీజిల్, మరో ఐదు బ్యారల్స్లో మరో వెయ్యి లీటర్ల డీజిల్ నిల్వ ఉంచి.. పైన కవర్లు కప్పి ఉంచారు. అటుగా వెళుతున్న వినియోగదారులు ఆరుబయట డీజిల్ నిల్వ ఉంచడంపై అనుమానాలు వ్యక్తం చేశారు. బ్లాక్ మార్కెట్కు తరలించాలనే ఉద్దేశంతోనే ఇలా నిల్వ చేశారన్న అనుమానంతో సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో డీజీఎస్ఓ శ్రీనివాసులు, ఎన్ఫోర్స్మెంట్ డీటీ వెంకటేశ్వర్రెడ్డి, ఏఎస్ఓ అశ్వక్, సేల్స్ ఆఫీసర్ హృదయ్, స్థానిక ఎస్ఐలు జయప్రసాద్, మల్లేశ్ తదితరులు పెట్రోల్ బంక్ వద్దకు చేరుకొని విచారించారు. నిబంధనలకు విరుద్దంగా ఆరుబయట బ్యారల్స్లో డీజిల్ నిల్వ ఉంచడంపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. అయితే శనివారం ఉదయం డీజిల్ ట్యాంకర్ వచ్చిందని.. బంక్ ట్యాంకుల్లో డీజిల్ పూర్తిస్థాయిలో నింపిన తర్వాత మిగిలి ఉన్న డీజిల్ను వెనక్కి పంపలేక ఇలా ట్యాంకు, బ్యారల్స్లో నిల్వ ఉంచాల్సి వచ్చిందని బంక్ నిర్వాహకులు అధికారులకు వివరించారు. దీనిపై పూర్తిస్థాయిలో విచారించి నిబంధనల మేరకు చర్యలు తీసుకుంటామని డీసీఎస్ఓ తెలిపారు.
డీసీఎస్ఓ విచారణ


