● అడవి పందిని తింటూ ఒకటి.. మరొకటి గుండుపై పడుకొని
● భయాందోళనకు గురవుతున్న పరిసర ప్రాంతాల రైతులు
గండేడ్: మండలంలోని మన్సూర్పల్లి బొందగట్టు ప్రాంతంలో శుక్రవారం చిరుతలు మళ్లీ రైతులకు కనిపించాయి. అందులో ఒకటి అడవి పందిని చంపుకొని తింటూ కనిపిస్తే మరొకటి గుండుపై పడుకుని కనిపించినట్టు స్థానికులు బాలయ్య, సాయికుమార్ తెలిపారు. మొన్న కొండాపూర్కు చెందిన మల్లయ్య మేకలపై దాడిచేసి ఒకదాన్ని చంపి మరోదాన్ని గాయాలపాలు చేసిన ఘటనను రైతులు చూసి తీవ్ర భయాందోళనకు గురయ్యారు. శుక్రవారం కూడా ఇదే ప్రాంతంలో కనిపించడం రైతులను మరింత భయభ్రాంతులకు గురి చేస్తుంది. చిరుతల సంచారంతో రైతులు పొలాలకే వెళ్లడంలేదు. పశువులను పొలాల దగ్గరి నుంచి ఇళ్లకు తీసుకొస్తున్నారు. దీంతో పొలానికి వెళ్లి పశువులకు మేత తీసుకురావాలన్నా.. వాటిని మేపాలన్నా చాలా ఇబ్బందికరంగా మారిందని ఆయా గ్రామాల రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు చిరుతలకు బోనులు ఏర్పాటు చేసి పట్టుకోవాలని కోరుతున్నారు. పశు ప్రాణనష్టం జరుగుతున్నా అటవీశాఖ అధికారులు ఎందుకు స్పందించడంలేదని ప్రశ్నిస్తున్నారు.


