● యువతి ప్రేమ వ్యవహారంలో పాల్పడినట్లుగా భార్య ఫిర్యాదు
కల్వకుర్తి టౌన్: బంధువులకు సంబంధించిన యువతి ప్రేమ వ్యవహారంలో వారి కుటుంబ సభ్యులు బెదిరించటంతోనే తన భర్త బలవన్మరణానికి పాల్పడ్డాడని, మృతిపై అనుమానాలు ఉన్నాయని భార్య ఫిర్యాదు చేసిన సంఘటన బుధవారం చోటు చేసుకుంది. ఎస్ఐ రాజశేఖర్, బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. మండలంలోని పంజుగులకు చెందిన బాలస్వామి(30)తో తాడూరు మండల కేంద్రానికి చెందిన శ్రీవాణితో నాలుగేళ్ల కిందట వివాహామైంది. వారికి ఇద్దరు సంతానం ఉన్నారు. తాడూరుకు చెందిన శ్రీవాణి అన్న మల్లేశ్ అదే గ్రామానికి చెందిన ఓ యువతిని ప్రేమించి పెళ్లి చేసుకొని, యువతితో పాటుగా శ్రీవాణి ఇంటిలోనే అతను తలదాచుకున్నాడని యువతి తరఫు బంధువులు పంజుగులలోని శ్రీవాణి ఇంటికి ఈ నెల 22వ తేదీన బెదిరింపులకు పాల్పడినట్లు తెలిపారు. అనంతరం బుధవారం తాడూరు పోలీస్స్టేషన్కు వచ్చి సదరు విషయమై మాట్లాడేందుకు 11 గంటల ప్రాంతంలో వెళ్లగా, పంజుగులకు చెందిన కొండల్రెడ్డి ఫోన్చేసి నీ భర్త మా పొలంలో పశువుల దొడ్డిలో ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడని తెలిపినట్లు బాధితురాలు తెలిపారు.
కఠిన చర్యలు తీసుకోవాలి
ప్రేమ వ్యవహారంలో నా భర్త బాలస్వామిని తీవ్ర బెదిరింపులకు గురిచేసిన కారణంగానే మనస్తాపంతో బలవన్మరణానికి పాల్పడ్డాడని భార్య శ్రీవాణి ఆవేదన వ్యక్తం చేశారు. బెదిరింపులకు గురిచేయటమే కాకుండా, వారిద్దరిని కొట్టడంతో అవమానాన్ని భరించలేకనే ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిపారు. మృతికి కారణమైన మల్లేష్, సాయిబాబు, బాలులపై కేసు నమోదు చేసి పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయాలని కల్వకుర్తి పోలీస్స్టేషన్లో శ్రీవాణి ఫిర్యాదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పట్టణంలోని సీహెచ్సీకి తరలించి అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రాజశేఖర్ తెలిపారు.
ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య
భూత్పూర్: మండలంలోని రావులపల్లి గ్రామానికి చెందన మహమూద్ పాష(19) మంగళవారం రాత్రి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్ఐ చంద్రశేఖర్ తెలిపారు. ఎస్ఐ కథనం మేరకు మహమూద్పాష ప్రైవేటుగా కరెంట్ పనులు చేస్తుండేవాడు. మంగళవారం పనుల్లో భాగంగా భూత్పూర్ వెళ్లి పనులు ముగించుకొని సాయంత్రం ఇంటికి వచ్చాడు. ఈ క్రమంలో రాత్రి 9: 30 గంటలకు గదిలోకి వెళ్లి తనను క్షమించాలని, మిస్యూ అమ్మ, అక్క, అన్న అని ఇన్స్ట్రాగాంలో పోస్టు పెట్టాడు. బయటకు వెళ్లిన పాష అన్న ఇన్స్ట్రాగాంలో తమ్ముడు పెట్టిన పోస్టును గమనించి ఇంటికి వచ్చి చూడగా గదిలో చీరతో ఫ్యానుకు ఉరేసుకుని విగతజీవిగా ఉండటాన్ని గుర్తించాడు. వెంటనే జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు గుర్తించారు. బుధవారం మృతుడి తల్లి హసీనా బేగం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పేర్కొన్నారు.


