● అజిలాపూర్ లిఫ్టు పనులకు శ్రీకారం
● ఏప్రిల్ మొదటివారంలో శంకుస్థాపన
● హాజరుకానున్న మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి
దేవరకద్ర రూరల్: దేవరకద్ర మండలం అజిలాపూర్లో ఏర్పాటు చేయనున్న ఎత్తిపోతల పథకంతో ఆరు గ్రామాల రైతుల సాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించనుంది. రూ.32కోట్లతో కోయిల్సాగర్ ప్రాజెక్ట్ సమీపంలో ఈ లిప్టు ఏర్పాటుకు పరిపాలన అనుమతులు గతంలో మంజూరైన పనులకు సబంధించి టెండర్ ప్రక్రియ పూర్తికావడంతోపాటు ఏప్రిల్ మొదటివారంలో శంకుస్థాపన పనులుకు ఏర్పాట్లు జరుగుతుండంతో రైతుల్లో ఆనందం నెలకొంది.
సాగునీరు అందక ఇబ్బందులు
ప్రాజెక్ట్ కూతవేటు దూరంలో ఉన్న పోలాలు ఎత్తయిన ప్రదేశంలో ఉండటంతో దశాబ్ధలుగా సాగునీరు అందక ఆరు గ్రామాల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయంపై ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే మధుసూదన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా.. గెలిచిన వెంటనే లిఫ్టు పనులు ప్రారంభిస్తానని ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి దృష్టికి పలుమార్లు సమస్యను తీసుకెళ్లి రూ.32కోట్ల పరిపాలన అనుమతులు తీసుకొచ్చారు. ఇటీవల టెండర్ ప్రక్రియ పూర్తి కావడంతో మంగళవారం అజిలాపూర్ స్టేజ్ వద్ద శంకుస్థాపన పనులను అధికారులు పరిశీలించారు. కార్యక్రమానికి మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరవనున్నట్లు సమాచారం. ప్రాజెక్ట్ పూర్తయితే సూమారు 5వేల ఎకరాలకు సాగునీరు అందనుంది. స్థల పరిశీలన చేసినవారిలో ఏఈ హరీందర్, నాయకులు భాస్కర్రెడ్డి, అంజిల్రెడ్డి, రాజుగౌడ్ తదితరులు పాల్గొన్నారు.


