● బోను ఏర్పాటుకు చర్యలు
గండేడ్: చిరుతల అవాసానికి బొందెగట్టు అనువైన ప్రదేశమని ఫారెస్టు డివిజనల్ అధికారి గణేష్ పేర్కొన్నారు. మండల పరిధిలోని మన్సూర్పల్లి గ్రామ శివారులో చిరుతలు సంచరిస్తున్న బొందెగట్టును మహమ్మాదాబాద్ ఫారెస్టు రేంజర్ అబ్దుల్హైతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బొందెగట్టు ప్రాంతం చిరుత పులుల నివాసానికి అనువుగా ఉందన్నారు. దీనికి తోడు సమీపంలో రెడ్డి చెరువు కూడ ఉండడంతో వేసవికాలంలో దాహార్తి తీర్చుకోవడానికి కూడా ఏలాంటి లేకపోవడంతో ఈ ప్రాంతంలో నివాసం ఉంటున్నట్లు వివరించారు. ఉన్నతాధికారుల అనుమతులు రాగానే బోను ఏర్పాటు చేసి చిరుతలను పట్టుకుంటామన్నారు. అప్పటి వరకు రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పశువులు మేకలు, గొర్రెలు వంటివి పొలాల దగ్గర కట్టెయకుండా ఇంటి దగ్గర ఉంచుకోవాలన్నారు. ఎప్పటికపుడు పరిస్థితిని గమనిస్తూ ఉండాలని డిప్యూటి రేంజ్ ఆఫీసర్ రాఘవేందర్కు సూచించారు. డిప్యూటీ రేంజర్ రాఘవేందర్ , బీట్ ఆఫీసర్ ఉదయేశ్వర్లు సాయంత్రం వరకు ఉండి చుట్టూ పక్కల ప్రాంతాల రైతులతో మాట్లాడి పలు సూచనలు. సలహాలు ఇచ్చారు. చిరుత పులులు బయటికి వచ్చినపుడు తమకు సమాచారం ఇవ్వాలని చుట్టుపక్కల వారిని కూడా అప్రమత్తం చేయాలని రైతులకు సూచించారు.


