● పరీక్ష కేంద్రాలను మొబైల్ జీరో జోన్గా మార్చాలి: కలెక్టర్ ఖుష్బూ గుప్తా
జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): జిల్లాలో కొనసాగుతున్న పదో తరగతి వార్షిక పరీక్షల నిర్వహణలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా సజావుగా నిర్వహించేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ ఖుష్బూ గుప్తా అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి విద్యాశాఖ అధికారులు, పరీక్ష కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లతో వెబెక్స్ ద్వారా పరీక్షల నిర్వహణపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. కేంద్రాల్లోకి మొబైల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను ఎట్టి పరిస్థితుల్లోకి అనుమతించరాదన్నారు. పరీక్ష కేంద్రాలను మొబైల్ జీరోజోన్గా మార్చేందుకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. ఇప్పటి వరకు ఎలాంటి సమస్యలు లేకుండా విజయవంతంగా నిర్వహించామని.. మిగిలిన పరీక్షలను కూడా అదే విధంగా జాగ్రత్తగా నిర్వహించాలని సూచించారు. కేంద్రాల్లోకి విద్యార్థులను అనుమతించే ముందే క్షుణ్ణంగా తనిఖీ చేయాలని ఆదేశించారు. మాస్ కాపీయింగ్ జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. పరీక్షలు ముగింపు వరకు చీఫ్ సూపరింటెండెంట్లు అప్రమత్తంగా ఉండాలని.. ఏదేని సమస్య తలెత్తితే వెంటనే ఉన్నతాధికారులను సంప్రదించాలని కలెక్టర్ సూచించారు. పరీక్ష కేంద్రాల్లో తాగునీరు, విద్యుత్ సరఫరా నిరంతరాయంగా ఉండేలా చూడాలన్నారు. సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్, జెడ్పీ సీఈఓ, ఇన్చార్జి డీపీఓ వెంకట్రెడ్డి, ఏఎంఓ శ్రీనివాస్ ఉన్నారు.


