ముగిసిన శివరాత్రి ఉత్సవాలు
● శేషవాహన సేవలో స్వామి, అమ్మవారు
● పూర్ణాహుతి, ధ్వజ అవరోహణంతో బ్రహ్మోత్సవాలు పరిసమాప్తం
● వసంతోత్సవంలో అర్చకులు, భక్తుల సంబురాలు
అలంపూర్: అలంపూర్ క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహోత్సవాలు ముగిశాయి. ఈనెల 14వ తేదీన ప్రారంభమైన మహాశివరాత్రి ఉత్సవాలు ఐదురోజులపాటు ఘనంగా జరిగాయి. ఉత్సవాల చివరిరోజు బుధవారం ఉదయం ప్రత్యేక పూజలు, విశేష కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయంలో నిత్య పూజా హోమాలు, బలిహరణలు అనంతరం శేషవాహన సేవలు నిర్వహించారు. శ్రీజోగుళాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి, జోగుళాంబ అమ్మవారి ఉత్సవ విగ్రహాలను శేషవాహనంపై కొలువుదీర్చారు. అర్చకులు పూజలు నిర్వహించి హారతులు అందజేశారు. ఆది దంతపలు శేషవవాహనంలో పురవీధుల్లో విహరించారు. భక్తులు ఆదిదంపతులకు స్వాగతం పలుకుతూ కొబ్బరికాయలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.
పూర్ణాహుతి సమర్పణ
అలంపూర్ క్షేత్రంలో మహాశివరాత్రి ఉత్సవ పూజలు పూర్ణాహుతితో ముగింపు పలికారు. యాగశాలలో మండపంలో రుద్రహోమాలు, కుష్మాండ బలిహరణం, ఆలయం చుట్టూ ఉత్సవ బలిభేరితో అష్టదిక్పాలకకుల బలిహరణం నిర్వహించారు. అవాహిత దేవతా మండపాలకు ప్రత్యేక పూజలు, నివేదనలు చేసిన ద్రవ్యాలతో పూర్ణాహుతి నిర్వహించారు. కలశ ఉద్వాసన, ఉత్సవాల ముగింపులో అర్చకులు, అధికారులు, భక్తులు, సిబ్బంది ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుని వసంతోత్సవ ఆనందాన్ని పంచుకున్నారు.
నాగకన్యల బావిలో తీర్థావళి
బాలబ్రహ్మేశ్వర స్వామి, జోగుళాంబ అమ్మవారి ఆలయ సముదాయంలోని నాగకన్యల బావిలో తీర్థావళిని నిర్వహించారు. స్వామి, అమ్మవారి ఉత్సవమూర్తులను పల్లకీలో నాగకన్యల బావి వద్దకు తీసుకొచ్చి ముర్తికాస్నానం, పంచామృతాభిషేకాలు చేశారు. అనంతరం ధ్వజఅవరోహనంతో సంపూర్ణంగా ముగింపు పలికారు.
ఐదురోజుల పాటు ఉత్సవాలు
అలంపూర్ క్షేత్రంలో ఐదురోజులపాటు అత్యంత వైభవోపేతంగా జరిగిన బ్రహోత్సవాలకు భక్తులుభారీ సంఖ్యలో తరలివచ్చారు. దీంతో ఆయా శాఖల ఆధ్వర్యంలో భక్తులకు సౌకర్యాలు కల్పించారు. పోలీస్లు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా భారీ బందోబస్తుతో భద్రత కల్పించారు. ఉత్సవాలు విజయవంతంగా ముగియడంతో ఆలయ అధికారులు, ఆయా శాఖల అధికారులు ఊపిరిపీల్చుకున్నారు.
నాగకన్యల బావిలో
ఆది దంపతుల పుణ్య స్నానాలు
ముగిసిన శివరాత్రి ఉత్సవాలు


