మాహె రంజాన్ ప్రారంభం
ఉపవాస దీక్ష విశేషాలు..
● నేటి నుంచే ఉపవాసాలు
● దివ్య ఖురాన్ అవతరించిన
పవిత్ర మాసం
● మసీదుల్లో ప్రారంభమైన తరావీ నమాజ్
జిల్లాకేంద్రంలోని రహమానియా ఈద్గా
స్టేషన్ మహబూబ్నగర్: ముస్లింలు అత్యంత పవిత్రంగా భావించే రంజాన్ మాసం బుధవారం రాత్రి నెలవంక దర్శనమివ్వడంతో ప్రారంభమైంది. ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం 9వ మాసమైన రంజాన్ ప్రారంభ సూచికగా మసీదుల్లో సైరన్లు మోగాయి. ముస్లింలు ఉపవాసాలను గురువారం తెల్లవారు జాము నుంచి ప్రారంభించారు. ప్రత్యేక ప్రార్థనలకు మసీదులు ముస్తాబయ్యాయి. రంజాన్ నెలలోనే పవిత్ర గ్రంథం దివ్యఖురాన్న అవతరించిందని ఇస్లాం మతస్తుల ప్రగాఢ నమ్మకం. ఉసవాస దీక్షలు ప్రతి ముస్లింపై విధిగా నిర్ణయమై ఉన్నాయని ఖురాన్లో పేర్కొనడం వల్ల ప్రాపంచిక జ్ఞానం తెలిసిన వారందరూ ఉపవాస దీక్షలు చేపడుతారు. ఈ పవిత్రమైన నెలలో చేసే ప్రతి పుణ్యకార్యానికి 70 రెట్ల ప్రతిఫలం లభిస్తుందని విశ్వసిస్తారు. ఉపవాస దీక్షల (రోజా) వల్ల దైవభీతి, పాప భయం జనిస్తుందని దైవవాణి పేర్కొనడంతో ముస్లింలు అత్యంత భక్తి ప్రపత్తులు, కఠోర ఉపవాస దీక్షలను పాటిస్తారు.
పవిత్ర రంజాన్లో 30 రోజులు ఉపవాస దీక్షలు పాటించాలి. సూర్యోదయం కంటే ముందే నిర్ధారిత సమయంలో ఆహార పానీయాలు తీసుకోవాలి, దీనిని ‘సహర్’ అంటారు. సూర్యాస్తమ సమయంలో ప్రతిరోజు కొన్ని నిమిషాల తేడాతో ఉపవాస దీక్ష విరమణ నిర్దేశించమైనది, దీనిని ‘ఇఫ్తార్’ అంటారు. ఎండు ఖర్జూరం తదితర పండ్లతో ఉసవాస దీక్ష విరమిస్తారు. ఉపవాస దీక్ష సమయంలో విధిగా నమాజ్ చేయాలి. అనైతిక ధర్మవిరుద్ధమైన చర్యలకు పాల్పడకుండా ఉండాలి. అపవిత్ర చర్యల వల్ల ఉపవాస దీక్ష లక్ష్యం దెబ్బతింటుంది. ఏ వ్యక్తి అయితే రంజాన్ నెలలో ఉపవాసం ఉంటాడో అతడు చేసిన పాపాలన్ని క్షమింపబడుతాయన్నది ముస్లింల నమ్మకం. రంజాన్ దీక్షలు నరకాగ్ని నుంచి కాపాడుతుందని హదీస్ (ప్రవక్త ప్రవచనాల సంపుటి) చెబుతుంది. ఉపవాసంతో ఉండి చేసే ప్రార్థనను అల్లాహ్ (దైవం) ఎప్పుడు తిరస్కరించడని చెబుతారు.


