పాత కక్షలతోనే హత్య
ఎర్రవల్లి: గత నెల 25న ఉండవెల్లి మండల పరిధి లోని కంచుపాడు గ్రామంలో జరిగిన హత్య కేసును ఎట్టకేలకు పోలీసులు ఛేదించారు. కేసుకు సంబంధించిన వివరాలను కోదండాపురం సీఐ కార్యాలయంలో బుధవారం సీఐ ప్రదీప్కుమార్ విలేకర్లకు వెల్లడించారు. ఉండవెల్లి మండల పరిధిలోని కంచుపాడు గ్రామానికి చెందిన మృతుడు కృష్ణయ్యగౌడ్ (43)కు అదే గ్రామానికి చెందిన అతని అన్న కుమారుడైన శ్రీనివాస్గౌడ్కు కల్లు, స్థలం విషయంలో గతంలో గొడవలు జరగడంతో శ్రీనివాస్గౌడ్ను ఊరిలో ఉండనివ్వక పోవడంతో హైదరాబాద్కు వెళ్లి ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నాడు. ఈ నేపథ్యంలో కృష్ణయ్యగౌడ్పై పగ పెంచుకొని ఎలాగైన అతడిని హతమార్చి తిరిగి గ్రామంలోకి రావాలనే ఉద్దేశంతో ఏ–1 శ్రీనివాస్గౌడ్, తన సహోద్యోగి హైదరాబాద్కు చెందిన ఏ–2 రాజును హత్యకు సహకరిస్తే రూ.50 వేల ఇస్తానని బేరం కుదుర్చుకొని అడ్వాన్సుగా రూ.10వేలు ఇచ్చాడు. ఈ నేపథ్యంలో కంచుపాడు గ్రామానికి చెందిన ఏ–3 అబ్దుల్నబి సహాయంతో పథకం ప్రకారం హత్యకు ప్లాన్ చేశాడు. గత నెల 25న కృష్ణగౌడ్, అదే గ్రామానికి చెందిన మాల వెంకటేష్ రాత్రి సుమారు 8 గంటల సమయంలో మద్యం తాగేందుకు వెళ్లిన సమయంలో వారిపై ఏ–1, 2 కారం పొడిని చల్లి ఇనుప రాడ్డుతో మృతుడి తలపై తీవ్రంగా దాడిచేసి హతమార్చారు. మృతి చెందినట్లు నిర్ధారించుకొని ఆయుధాలను సమీప మొక్కజొన్న పొలంలో వేసి, మొబైల్స్ను పగలకొట్టి కాల్వలో వేసి పరారైనట్లు తెలిపారు. మృతుడి తల్లి ఈడిగ బిచ్చమ్మ ఫిర్యాదు మేరకు గత నెల 26న ఉండవెల్లి పీఎస్లో కేసు నమోదు చేశారు. ఎస్పీ, ఏఎస్పీ, డీఎస్పీ పర్యవేక్షణలో అలంపూర్ సీఐ మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి సాంకేతిక, పోలీస్శాఖ పరిజ్ఞానంతో విచారించి కేసును ఛేదించి ముగ్గురు నిందుతులను అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. వారి వద్ద ఒక ఐరన్ రాడ్, ఐదు మొబైల్స్ను స్వాధీనం చేసుకొని రిమాండ్కు తరలించినట్లు సీఐ తెలిపారు. చాకచక్యంతో కేసును ఛేదించిన ఎస్ఐలు శేఖర్, రవినాయక్, తరుణ్కుమార్రెడ్డి, సిబ్బందిని సీఐ అభినందించి వారికి రివార్డు అందజేశారు.


