ఉదండాపూర్ ఆర్అండ్ఆర్ను త్వరగా పూర్తి చేయాలి
జడ్చర్ల: పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా ఉదండాపూర్ రిజర్వాయర్ నిర్మాణంలో నిర్వాసితుల కోసం ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ఆర్అండ్ఆర్ పనులు త్వరగా పూర్తి చేయాలని కమిషనర్ శివకుమార్ నాయుడు అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన మండల పరిధిలోని దేవునిగుట్ట సమీపంలో 291 ఎకరాలలో ఏర్పాటు చేస్తున్న ఆర్అండ్ఆర్ పనులను పరిశీలించారు. రిజర్వాయర్ పరిధిలోని భూములు, ఇళ్లు కోల్పోతున్న వల్లూరు, ఉదండాపూర్తో పాటు ఐదు గిరిజన తండాలకు చెందిన నిర్వాసితులకు రూ.171.55 కోట్లతో మౌలిక సదుపాయాలతో వసతులు కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇంటి స్థలాలతో పాటు రోడ్లు, డ్రెయినేజీ, వీధి దీపాలు, తాగునీరు, పాఠశాలలు నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు నిర్వాసితులకు కోల్పోతున్న ఇళ్ల నిర్మాణాలు, ఇతర ఆస్తులకు సంబంధించి రూ.250 కోట్లు చెల్లించామని, మరో రూ.430 కోట్లు చెల్లించాల్సి ఉందని ఈ సందర్భంగా అధికారులు వివరించారు. బ్యాలెన్స్ ఆర్అండ్ఆర్ పరిహారాన్ని త్వరగా మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఆయన వెంట నీటిపారుదల శాఖ ఇంజనీర్ ఉదయ్శంకర్ ఉన్నారు.


