
జూరాలకు 1.88 లక్షల క్యూసెక్కుల వరద
● 26 క్రస్టు గేట్ల ఎత్తి దిగువకు నీటి విడుదల
ధరూరు/ రాజోళి/ ఆత్మకూర్: ప్రియదర్శిని జూరా ల ప్రాజెక్టుకు వరద భారీగా పెరిగింది. గురువారం రాత్రి 10 గంటల వరకు ప్రాజెక్టుకు వస్తున్న ఇన్ఫ్లో 1.88 లక్షల క్యూసెక్కులకు పెరగడంతో 26 క్రస్టు గేట్లను ఎత్తి 1,77,710 క్యూసెక్కుల నీటిని దిగువ కు విడుదల చేస్తున్నారు. అలాగే విద్యుదుద్పత్తి ని మిత్తం 30,400 క్యూసెక్కులు, నెట్టెంపాడుకు 750, భీమా లిఫ్టు–1కు 650, ఎడమ కాల్వకు 1,030, కుడి కాల్వకు 570, భీమా లిఫ్టు–2కు 750 క్యూసెక్కులు వదలగా.. మరో 45 క్యూసెక్కులు ఆవిరైంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం 8.126 టీఎంసీల నీరు నిల్వ ఉంది.
సుంకేసులలో మూడు గేట్లు..
సుంకేసుల డ్యాం వద్ద మూడు గేట్ల ద్వారా నీటి వి డుదల చేస్తున్నట్లు జేఈ మహేంద్ర తెలిపారు. గురువారం ఎగువ నుంచి 17,250 క్యూసెక్కుల ఇన్ ఫ్లో రాగా.. మూడు గేట్లను ఒక మీటర్ మేర ఎత్తి.. 13,236 క్యూసెక్కులు దిగువకు, కేసీ కెనాల్ కు 2,445 క్యూసెక్కులు వదిలినట్లు ఆయన పేర్కొన్నారు.
లక్ష్యానికి మించి విద్యుదుత్పత్తి
జూరాలలోని జల విద్యుత్ కేంద్రాల ద్వారా ఈ ఏడాది లక్ష్యానికి మించి విద్యుదుత్పత్తి చేపడుతున్నారు. కాగా.. గురువారం ఎగువలో 6 యూనిట్ల ద్వారా 234 మెగావాట్లు, దిగువలో 6 యూనిట్ల ద్వారా 240 మెగావాట్లు విద్యుదుత్పత్తి చేపట్టామని ఎస్ఈ శ్రీధర్ తెలిపారు.