
పొలికెపాడులో మహిళ దారుణ హత్య
గోపాల్పేట: ఉన్నట్టుండి తెల్లవారేసరికి గ్రామంలోని ఓ ఇంట్లో మర్డర్ జరిగిందని తెలియడంతో మండలంలోని పొలికెపాడు గ్రామస్తులు ఉలిక్కిపడ్డారు. వనపర్తి జిల్లా గోపాల్పేట మండలంలోని పొలికెపాడు గ్రామంలో ఆదివారం చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించి ఎస్ఐ నరేష్కుమార్ కథనం ప్రకారం.. మండలంలోని పొలికెపాడు గ్రామానికి చెందిన మహమూద(55), చోటేమియా భార్యాభర్తలు. వీరికి ఇద్దరు కుమారులు, ఒక కూతురు ఉండగా అందరికీ పెళ్లిళ్లు అయ్యాయి. అయితే ఇద్దరు కుమారులు కుమారులు హైదరాబాద్లో పనులు చేసుకుని జీవనం సాగిస్తుండగా.. భార్యాభర్తలు మాత్రమే గ్రామంలో కూలీ పనులు చేసుకుని జీవిస్తున్నారు. కొన్నిరోజులుగా చోటేమియాకు ఆరోగ్యం బాగో లేకపోవడంతో ఆస్పత్రిలో చూపించారు. ఈ క్రమంలో శనివారం రాత్రి భార్యాభర్తల మధ్య చిన్నపాటి గొడవ జరిగింది. తెల్లారేసరికి మహమూద రక్తపు మడుగులో పడి ఉంది. ప్రతిరోజూ ఉదయమే లేచే మహమూద ఎంతకూ బయటికి రాకపోవడంతో చుట్టుపక్కల వారు తలుపు తెరిచి చూడగా మహమూద రక్తపు మడుగులో పడిపోయి కనిపించింది. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. తలపై, చెంప దగ్గర పదునైన ఆయుధంతో దాడి చేయడంతోనే మరణించిందని పోలీసు లు గుర్తించారు. శనివారం రాత్రి ఇంట్లో గొడవ జరగడం, ఉదయం భర్త కనిపించకపోవడంతో భర్తనే ఈ హత్య చేసి ఉంటాడనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఘటనా స్థలా న్ని డీఎస్పీ వెంకటేశ్వర్రావు, సీఐ కృష్ణ పరిశీలించారు. క్లూస్టీం, డాగ్స్క్వాడ్ బృందాలు ఘటనా స్థలంలో ఆధారాలు సేకరించాయి.
మహిళ మృతదేహం లభ్యం
తిమ్మాజిపేట: మండలంలోని పుల్లగిరికి వెళ్లే దారిలో ఉన్న గుడ్షెప్పర్డ్ పాఠశాల వెనుక భాగంలో ఓ మహిళ మృతదేహం లభ్యమైంది. తండావాసుల కథనం మేరకు ముడావత్ లక్ష్మీ 6 రోజుల క్రితం ఇంట్లో ఎవరికి చెప్పకుండా వెళ్లిపోయింది. కుటుంబ సభ్యులు ఎంత వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో భర్త వెంకటయ్య శనివారం సాయంత్రం పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఈ క్రమంలో గుడ్ షెప్పర్డ్ పాఠశాల వెనుక కుక్కలు అరుస్తుండడం గమనించిన అటుగా వెళుతున్న వారు దగ్గరకు వెళ్లి చూడగా మృతదేహం ఉండడంతో కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహం ముడావత్ లక్ష్మీదిగా గుర్తించి మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
దంపతులపై దాడి..
పోలీసులకు ఫిర్యాదు
నవాబుపేట: మండల పరిధిలోని పోమాల్ గ్రామానికి చెందిన ఓ మహిళపై అదే గ్రామానికి చెందిన కుమ్మరి రమేష్ దాడి చేయడంతో కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ విక్రమ్ తెలిపారు. మహిళపై దాడి చేయడంతో పాటు లైంగిక దాడి చేసేందుకు యత్నించగా ఆమె భర్త అడ్డుకునే ప్రయత్నం చేయబోయాడు. దీంతో రమేష్ అతనిపై కూడా దాడి చేశాడు. ఈ క్రమంలో బాధితురాలు ఆదివారం పోలీసులను ఆశ్రయించింది. గతంలో జరిగిన లైంగిక దాడి ఘటనలో తనపై ఉన్న పాత కేసును విత్డ్రా చేసుకోవాలని దాడిచేసి భయభ్రాంతులకు గురిచేసినట్లు బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ వెల్లడించారు.