కొనసాగుతున్న ‘స్వచ్ఛత’ కార్యక్రమాలు
మహబూబ్నగర్ మున్సిపాలిటీ: వంద రోజుల ప్రత్యేక కార్యాచరణ లో భాగంగా నగరంలో ఈనెల 2 నుంచి ముమ్మరంగా ‘స్వచ్ఛత’ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ఇంటింటికీ వచ్చే స్వచ్ఛ ఆటోలకే తడి, పొడి చెత్త వేరు చేసి ఇవ్వాలని ప్రజలకు పారిశుద్ధ్య విభాగం అధికారులు, సిబ్బంది అవగాహన కల్పిస్తున్నారు. ఓపెన్ ప్లాట్ల లో చెత్తాచెదారం ఉంటే తొలగించి ఆ వెంటనే యజమానులకు నోటీసులు జారీ చేస్తున్నారు. అలాగే ఆయా డివిజన్ల పరిధిలోని వివిధ దుకాణాల వద్ద నిషేధించిన ప్లాస్టిక్ కవర్లు అమ్మవద్దని స్టిక్కర్లు అంటిస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారికి రూ.వేయి నుంచి రూ.పది వేల వరకు జరిమానా విధిస్తామని హెచ్చరిస్తున్నారు. ఈ కార్యక్రమాల్లో శానిటరీ ఇన్స్పెక్టర్లు గురులింగం, రవీందర్రెడ్డి, వజ్రకుమార్రెడ్డి, ఎన్విరాన్మెంటల్ ఇంజినీర్ చరణ్, ఎస్బీఎం కన్సల్టెంట్ సుమీత్రాజ్తో పాటు జవాన్లు పాల్గొంటున్నారు.


